Roja : ఏపీలో అధికార కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతల్లో ఒకరైన ఆర్కే రోజా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ చిత్తూరు నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఏకంగా పార్టీలోని కొందరు నేతలపై ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇలాకాలో అధికార పార్టీ రాజకీయాలు ఇలా ఉన్నాయా అనే టాక్ వినిపిస్తోంది.
రోజా ఏమంటున్నారంటే…
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో 14 మంది వైసీపీ అభ్యర్థులు పోటీలో దిగారు. కాగా, దీనిపై నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు. నగరిలో ఓటు వేసిన అనంతరం మాట్లాడిన రోజా.. ఈడిగ కార్పొరేషన్ ఛైర్పర్సన్ కె.జె.శాంతి, కె.జె.కుమార్పై అసహనం వ్యక్తం చేశారు.
రోజా ఆవేదన చూశారా?
నగరిలో తెలుగుదేశం పార్టీ గెలిచినా పర్వాలేదని చెప్పి కొంతమంది వ్యక్తులు 14 మంది రెబల్స్ ను బరిలోకి దించారని రోజా మండిపడ్డారు. అలా బరిలో దిగిన వారు గెలిచేందుకు పెద్ద ఎత్తున పంపిణి చేసారని రోజా ఆరోపించారు. గతంలో తనను గెలవకుండా అడ్డుకున్న శక్తులు ఇప్పుడు మరలా అదే విధంగా చేస్తున్నాయని ఆరోపణలు చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా నగరి, పుత్తూరు మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధిస్తుందని రోజా ధీమా వ్యక్తం చేశారు. కొద్ది వారాల కిందట కూడా రోజా ఇలానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రివిలైజ్ కమిటీ ముందు కూడా తన బాధ చెప్పుకుని కన్నీరు పెట్టారు. అదింకా మర్చిపోకముందే మరోసారి పార్టీలో వ్యతిరేక వర్గంపై ఓ రేంజ్లో ఫైర్ అవడం చూస్తుంటే… టీడీపీకి రోజా మంచి చాన్స్ ఇచ్చారని అంటున్నారు.