RRR vs Vijayasai: ఏపీ రాజకీయాలు హీటెక్కాలంటే ప్రభుత్వం, ప్రతిపక్షమే అవసరం లేదు. వైసీపీలోనే ఉన్న రెబల్, ఎంపీ రఘురామకృష్ణ రాజు చాలు. సీఎం జగన్ ను నిత్యం టార్గెట్ చేస్తూ.. తనను విమర్శించే వారందరిపై సెటైర్లు, కౌంటర్లు వేస్తారు. వైసీపీ వర్సెస్ రఘురామ ఎపిసోడ్ కొన్నాళ్లుగా రావణకాష్టంలా రగులుతూనే ఉంది. రీసెంట్ గా రఘురామ.. తన హత్యకు కుట్ర జరుగుతోందని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. ‘ఢిల్లీలో కూర్చుని ‘నన్ను చంపేస్తారు’ అని ఏడుపు మొదలెట్టాడు..’ నరసాపురం ప్రజలకు మొహం చూపలేక పబ్లిసిటీ స్టంట్ మొదలెట్టాడు అంటూ కామెంట్ చేశారు. దీనికి రఘురామ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చారు.
ట్వీట్ తో ఆసక్తి..
విజయసాయిని ఉద్దేశిస్తూ.. ‘వీడిని విశాఖ నుంచి తరిమేసి అండమాన్ కు పంపిస్తే మళ్లీ వచ్చేశాడు. సీఎం చేతిలో ఎన్నిసార్లు తన్నులు తిన్నా సిగ్గులేదు. రేపో మాపో వీడు కూడా నా దారి పడతాడు.. వెయిట్ అండ్ సీ’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్లు ఏపీ రాజకీయాల్లో వైరల్ అయ్యాయి. ‘సీఎం చేతిలో తన్నులు.. నా దరే పడతాడు’ అనే వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తించాయి. ఈ (RRR vs Vijayasai) ట్వీట్ తో రఘురామ చీకట్లో బాణం వేసారా..? నిజమే చెప్తున్నారా..? సీఎంపై అసంతృప్తులు ఉన్నారా..? అనే అనుమానాలు రాకపోవు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీలో సైతం ఇలా అసంతృప్తులు ఉన్నా.. రఘురామ స్టయిల్లో బహిర్గతమైన వారు లేరు.. ఉన్నా.. వెంటనే దిద్దుబాటు చర్యలు జరిగిపోయేవి.
నడి వీధిలో పెట్టేశారా..
కానీ.. రఘురామ ఎపిసోడ్ కు ఎవరూ ముగింపు ఇవ్వలేకపోతున్నారు. పార్టీలో చాలామంది నా బాటే పడతారు అని గతంలోనే రఘురామ అన్నారు. కానీ.. ఏకంగా (RRR vs Vijayasai) విజయసాయిరెడ్డిపైనే ఈ వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగించేవే. ఏదేమైనా.. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు పార్లమెంటేరియన్లు ఒకరికొకరు వాదులాడుకుంటూ తమ ప్రతిష్టను రాజకీయ నడి వీధిలో పెట్టేసారనే చెప్పాలి. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగితే ప్రజలకు ఇంపుగానే ఉంటుంది కానీ.. స్వపక్షంలో ఉన్నవారే ఇలా చేస్తే అది కంపు అవుతుంది. అయితే.. వీటన్నింటికి ముగింపు.. రఘురామ రాజీనామా చేస్తే.. ఉప ఎన్నికలో గెలుపెవరిదో తేలాకే అని చెప్పాలి.