RRR: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడిన విషయం తెలిసిందే. ఏడాదిన్నరకు పైగా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ఇరుకున పెడుతూ కొరకరాని కొయ్యగా మారారు. ఇంత చేస్తున్నా పార్టీ నుండి వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేయడం లేదు. పార్టీ నుండి సస్పెండ్ చేస్తే వైసీపీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవిని అప్పణంగా అనుభవించే అవకాశం అతనికి దక్కుతుంది. ఆ అవకాశం అతనికి కల్పించకూడదని అనర్హత వేటు వేయాలని వైసీపీ శతవిధాలుగా ప్రయత్నిస్తూ వచ్చింది. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు రఘురామపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇచ్చారు. పలు మార్లు ఆయన్ను వైసీపీ ఎంపీలు కలిసి విజ్ఞప్తి చేసినా నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నా ఆయనపై వేటు పడలేదు. అనర్హత వేటు పడిన తరువాత పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వైసీపీ భావిస్తోంది. కానీ అనర్హత వేటు విషయంపై స్పీకర్ ఏమీ తేల్చడం లేదు. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణం రాజే కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఫిబ్రవరి 5వ తేదీ లోగా తన పై అనర్హత వేటు వేయించాలని సవాల్ విసిరారు. ఒక వేళ అనర్హత వేటు వేయించలేకపోయినా తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, ఉప ఎన్నికలకు వెళతానని వెల్లడించారు.
Read More: TDP Janasena: పవన్ కళ్యాణ్ కి సీఎం సీటు..!? నిజమెంత..!?
RRR: సేఫ్ జోన్ లో ఉండేందుకే..?
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో రఘురామ కృష్ణం రాజు బీజేపీ కాకుండా టీడీపీ లేదా జనసేన పార్టీలో చేరితే అధికార పార్టీ, ప్రభుత్వం నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఆయన సేఫ్ జోన్ లో ఉండేందుకు బీజేపీలో చేరి నర్సాపురం ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారని సమాచారం. అయితే కేవలం బీజేపీ – జనసేన కూటమి అభ్యర్ధిగా ఆయన పోటీ చేస్తే ఓటమి ఖాయమని రఘురామకు తెలుసు. అందుకే వూహాత్మకంగా వైసీపీని వ్యతిరేకించే అన్ని పార్టీల మద్దతుతో పోటీ చేయనున్నానని పేర్కొన్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని వైసీపీ మినహా ఇతర రాజకీయ పక్షాలు అన్నీ కోరుతున్నాయి. అమరావతి రైతుల ఆందోళనకు టీడీపీతో సహా అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలియజేశారు. ఇప్పుడు రఘురామ ఇదే అంశాన్ని తన రాజీనామా అస్త్రంగా, ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుని బీజేపీ – జనసేన అభ్యర్ధిగా నరసాపురం లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొందరు నేతల కారణంగా బీజేపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ తరపున రఘురామ కృష్ణంరాజు పోటీ చేస్తే ఒక విధంగా చంద్రబాబుకు పెద్ద పరీక్షేనని అంటున్నారు.
తెలంగాణలోని హూజూరాబాద్ కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి అభ్యర్ధిని పోటీ పెట్టకుండా సహకరించడం, దానికి తోడు ఈటల రాజేందర్ వ్యక్తిగత ఇమేజ్ తో గెలిస్తే ఆ గెలుపును బీజేపీ తమ ఖాతాలో వేసుకుంది. తమ పార్టీ బలం, గెలుపుగా ప్రచారం చేసుకుంటోంది. ఇక్కడ నరసాపురం విషయానికి వస్తే జనసేనకు సుమారు రెండు లక్షలకుపైగా ఉన్నాయి కానీ బీజేపీకి దానిలో పదో వంతు కూడా ఉండవు. గతంలో రెండు పర్యాయాలు టీడీపీ మద్దతుతోనే బీజేపీ అభ్యర్ధులు ఈ నియోజకవర్గం నుండి గెలిచారు. జనసేన మద్దతు లేకుండా బీజేపీ అభ్యర్ధి పోటీ చేస్తే డిపాజిట్లు రావు అన్నది అందరికీ తెలిసిందే. టీడీపీని బీజేపీ శత్రువుగా చూస్తున్న ఈ తరుణంలో రఘురామ కృష్ణంరాజుకు మద్దతు ఇచ్చే విషయంలో చంద్రబాబు పెద్ద పరీక్షనే ఎదుర్కోవాల్సి వస్తుంది. పార్టీ వైరుధ్యం అయినప్పటికీ అమరావతి నినాదంతో పోటీ చేస్తున్నందున రఘురామకు టీడీపీ మద్దతు ఇవ్వకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడుతోంది. చూడాలి ఏమి జరుగుతుందో..?