RRR: ఏపి సీఐడీ ఇచ్చిన షాక్తో వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు నర్సాపురం పర్యటనను రద్దు చేసుకున్నారు. రాత్రికి రాత్రి హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఢిల్లీలో న్యాయవాదులతో మంతనాలు ఆరంభించినట్లు తెలుస్తోంది. విషయంలోని వెళితే..త్వరలో తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణం రాజు సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వెళ్లాలని భావించారు. ఆ క్రమంలో ఢిల్లీ నుండి హైదరాబాద్ కు చేరుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తన నియోజకవర్గంలోకి వస్తున్నందున తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరుతూ రఘురామ కృష్ణంరాజు జిల్లా ఎస్పీకి సమాచారం అందించారు.
RRR: సీనియర్ న్యాయవాదులతో చర్చలు
అయితే ఏపి సీఐడీ అధికారులు నిన్న హైదరాబాద్ లోని రఘురామ నివాసానికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీన ఏపీ సీఐడీ కార్యాలయంలో విచారణ కు హజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇంతకు ముందు రాజద్రోహం తదితర సెక్షన్ల కింద రఘురామను ఏపీ సీఐడీ అరెస్టు చేయడం, ఆ తరువాత ఆయను సుప్రీం కోర్టును ఆశ్రయించి బెయిల్ తీసుకున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల తరువాత ఆ కేసుకు సంబంధించి విచారణకు హజరుకావాలని సీఐడీ నోటీసులు జారీ చేయడంతో విచారణకు హజరు అవుతానని వెల్లడించిన రఘురామ.. హుటాహుటిన హైదరాబాద్ నుండి ఢిల్లీకి తిరిగి వెళ్లిపోయారు. ఈ నోటీసుల అంశంపై ఆయన డిల్లీలో సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
నర్సాపురం పర్యటన రద్దు చేసుకున్న నేపథ్యంలో అభిమానులు, నేతలు ఎవ్వరూ ఎయిర్ పోర్టు వద్దకు రావద్దంటూ రఘురామ కృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులతో చర్చించేందుకు ఢిల్లీలో ఉన్నందున నియోజకవర్గ పర్యటన వాయిదా వేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మరో పక్క ఏపీ సీఐడీ అధికారి సునీల్ కుమార్ పై రఘురామ కృష్ణంరాజు కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ పలువురు ఆందోళన నిర్వహించారు. రఘురామ దిష్టిబొమ్మను దగ్ధం చేసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందజేశారు. తనపై వచ్చిన ఆరోపణలను రఘురామ ఖండించారు.