RS Praveen Kumar: మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గత కొద్దిరోజులుగా సంచలన పరిణామాలతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. పదవికి రాజీనామా చేసి పాలిటిక్స్ లోకి రాబోతున్నట్లు ప్రకటించిన ఆయన ఈ మేరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. అయితే, తాజాగా ఆయన సోషల్ మీడియాలో సంచలన కామెంట్లు చేశారు. ప్రభుత్వ రాజప్రసాదాలకు పవర్ కట్ చేసే రోజులు దగ్గరపడ్డాయని మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. తన సభల్లో జరిగిన ఉదంతాలను ప్రస్తావిస్తూ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
Read More: RS Praveenkumar: ఆర్ఎస్ ప్రవీణ్ దారిలోనే ఆకునూరి మురళి… విషయం ఏంటంటే..
ఆర్ఎస్ ప్రవీణ్ ఏమంటున్నారంటే…
తాను పాల్గొన్న సభలలో.. తాను మాట్లాడే సమయంలోనే కావాలనే పవర్ కట్ చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపించారు. అదేవిధంగా తనతో మాట్లాడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టారని ఆయన అన్నారు. దీనికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘ఇప్పటికి వరుసగా మూడు సభల్లో సరిగ్గా నా స్పీచ్ టైంలోనే పవర్ కట్ అయింది. నాతో మాట్లాడుతున్న వ్యక్తులపై నిఘా సంగతి ఇక చెప్పనక్కరలేదు. మా శ్రమను దోపిడి చేసి కట్టుకున్న మీ రాజప్రసాదాలకు తెలంగాణ ప్రజలు పవర్ కట్ చేసే రోజులు దగ్గర పడ్డాయి. దయచేసి గుర్తుంచుకోండి’ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
Read More: RS Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్ టార్గెట్ కేసీఆర్యేనా? ఆ మాటల అర్థం అదే కదా?
బీఎస్పీలో చేరడం ఖరారైపోయినట్లేనా?
ఇటీవల వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరనుండటం ఖరారైన సంగతి తెలిసిందే. బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రవీణ్ కుమార్కు ఆఫర్ ఇచ్చినట్టు ఇంతకు ముందే వార్తలు వచ్చాయి. బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని ప్రవీణ్ కుమార్కు ఇచ్చేందుకు మాయావతి సిద్ధంగా ఉన్నారంటూ ప్రచారం జరిగింది. బీఎస్పీలో ప్రవీణ్ కుమార్ చేరికకు సంబంధించి ఆయన స్థాపించిన స్వేరోస్ సంస్థ ఓ ప్రకటనను విడుదల చేసింది.