Breaking: 40 మంది ప్రయాణీకులతో వెళుతున్న ఓ ఆర్టీసీ బస్సులో ఒక్క సారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రయాణీకులు ఒక్కసారిగా ఆందోళనకు గురైయ్యారు. ప్రమాదాన్ని గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ప్రయాణీకులు అందరినీ దించివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన విజయవాడ – గుడివాడ రహదారిలో పెదపారుపూడి మండలం పులవర్తిగూడెం వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే …
విజయవాడ నుండి గుడివాడ వైపు వెళుతున్న బస్సులో ఒక్కసారిగా ఇంజన్ నుండి మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశారు. వెంటనే బస్సులో ఉన్న ప్రయాణీకులను కిందకు దిగమని చెప్పడంతో అందరూ హడావుడిగా దిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. హడావుడిలో కొందరు ప్రయాణీకులు తమ వెంట తెచ్చుకున్న వస్తువులు కూడా బస్సులోనే వదిలివేయడంతో మంటల్లో కాలిబూడిద అయ్యాయి. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రయాణీకులు దిగిన కొద్దిసేపటికే బస్సు నుండి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉన్నారు. స్థానికుల సమాచారంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.