RUIA Deaths: ఈ నెల 10వ తేదీన తిరుపతి రూయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక పలువురు కరోనా రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది కరోనా రోగులు మృతి చెందారని అధికారులు వెల్లడిస్తుండగా ఎక్కువ మందే మృతి చెందారని ప్రచారం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పది లక్షల వంతున తక్షణ సహాయం మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఓ పక్క హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా మరో పక్క జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది.
ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపి చింతా మోహన్తో పాటు సుధాకర్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన మూడు రోజుల వరకూ ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. ఆసుపత్రి వర్గాలు మాత్రం మొత్తం మృతుల జాబితాను విడుదల చేశాయి. మానవ తప్పిదం వల్లే రూయాలో 30 మంది చనిపోయారని ఫిర్యాదు అందడంతో ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయ్యింది. ఘటనలో 30 మంది వరకూ చనిపోయారన్నది నిజమైతే తీవ్ర మానవ హక్కుల ఉలంఘన అవుతుందని ఎన్హెచ్ఆర్సీ అభిప్రాయపడింది. ఈ ఘటనపై పూర్తి నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ఆరోగ్య శాఖను ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. నాలుగు వారాల్లో నివేదిక అందించాలని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి స్పష్టం చేసింది. రూయా ఘటనపై ఓ పక్క హైకోర్టులో విచారణ జరగడం, మరో పక్క జాతీయ మానవ హక్కుల సంఘం కేసు స్వీకరించి వివరణ కోరడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఘటన జరిగిన రోజు 20 నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు రోగుల కుటుంబ సభ్యులు చెబుతుండగా, అయిదు పది నిమిషాల్లోనే ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరణ జరిగిందని అధికారులు చెబుతున్నారు. తమిళనాడు నుండి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యం అవ్వడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు వెల్లడిస్తున్నారు.