Nimmagadda : గత నెల వరకూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబు జేబులో మనిషి, ఆయన ఎలా ఆడిస్తే ఆలా ఆడతారు, ఆయన ఉండగా ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదు అంటూ నానా యాగీ చేసిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు ఒక్క సారిగా యూ టర్న్ తీసుకున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డ తన హయాంలోనే పూర్తి చేయాలని కోరుతున్నారు. రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి అయ్యాయి. ఇక జడ్పీటీసి, ఎంపీటీసీ ఎన్నికలు మిగిలి ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో 75 శాతంకు పైగా వైసీపీ మద్దతుదారులు గెలుచుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ విజయఢంకా మోగించింది. కేవలం ఒక్క మున్సిపాలిటీ మాత్రమే వైసీపీ కోల్పోయింది. 11 నగర పాలక సంస్థలు, 70కి పైగా మున్సిపాలిటీలలో వైసీపీ జెండా ఎగిరింది. దీంతో ఇదే జోష్ లో జడ్పీటీసీ, ఎంపిటీసీ ఎన్నికలకు వెళితే ఇవే ఫలితాలు వస్తాయని భావిస్తున్న అధికార పార్టీ.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలని కోరుతోంది.
ఇటీవల కాలం వరకూ ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగిన వార్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల అధికారులకు సాధారణ సమయాల్లో పెద్దగా గుర్తింపు ఉండదు. ఎన్నికలకు సమయంలో మాత్రమే వారికి అధికారులు, రాజకీయ పార్టీల నుండి గుర్తింపు, గౌరవం లభిస్తుంటుంది. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత ఏడాది కరోనా నేఫథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేకుండా ఎన్నికల ప్రక్రియను అర్ధాంతరంగా వాయిదా వేయడంతో జగన్ సర్కర్ సీరియస్ అవ్వడం, ఆ కోపంతో ఆయనను పదవి నుండి తప్పించి కొత్తగా కనగరాజ్ అనే మాజీ జస్టిస్ ను నియమించడం, న్యాయపోరాటం చేసి నిమ్మగడ్డ తిరిగి ఆ సీటుకు మళ్లీ రావడం తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31వతేదీ న పదవీ విరమణ చేయనున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన హయాంలో ఎన్నికలు నిర్వహించాలని పట్టుదలతో పావులు కదపగా ఎన్నికలు ఇప్పట్లో వద్దే వద్దు అంటూ ప్రభుత్వం గట్టిగా చెప్పింది.
ఒక పక్క కరోనా సెకండ్ వేవ్ వస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది ఇప్పుడు ఎన్నికలు వద్దు అంటూ వైసీపీ పెద్దలు నానా యాగీ చేశారు. దీంతో ఈ వ్యవహారం హైకోర్టు తరువాత సుప్రీం కోర్టు వరకూ వెళ్లినా ఎస్ఈసీకి అనుకూలంగా తీర్పు రావడంతో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడం, ఆ తరువాత మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయడం జరిగింది. ప్రభుత్వంలోని పెద్దలు నిమ్మగడ్డను నేరుగా విమర్శలు చేయడం, ఆయన పట్టుదలతో ఎన్నికలు నిర్వహించడంతో రాష్ట్రంలో గతంలో ఏ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు రాని గుర్తింపు నిమ్మగడ్డకు వచ్చింది. ఇదిలా ఉంటే పదవీ విరమణలోనే రెండు ఎన్నికలు పూర్తి చేసినందున ఇక ఎల్టీసీపై వారం రోజుల పాటు తీర్ధయాత్రలకు వెళ్లాలన్న ఆలోచనలో ఎస్ఈసీ నిమ్మగడ్డ ఉంటే..ఇంకా ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే ఉన్న ఎంపీటీసీ, జడ్ పీటీసీ ఎన్నికలను నిమ్మగడ్డ పూర్తి చేయాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోరుతున్నారు.
ఈ ఎన్నికలను కూడ తన హయాంలో నిమ్మగడ్డ నిర్వహిస్తే తరువాత ఆయన తన జీవిత చరిత్రలో రాసుకోవడానికి బాగుంటుందని అని సజ్జల సెటైర్ వేశారు. ఇంతకు ముందు ఎస్ఈసీ పంతానికి పోయి పరిషత్ ఎన్నికలు పక్కన పెట్టి ఎజండాలోని పంచాయతీ ఎన్నికలు ముందుకు తీసుకువచ్చి వాటిని నిర్వహించారని సజ్జల విమర్శించారు. 80శాతం ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను నిర్వహించకుండా ఎస్ఈసీ సెలవుపై వెళ్లాలని భావించడం విడ్డూరంగా ఉందనీ, ఇది అన్యాయమన్నారు. రేపటి నుండి మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తామని ఎస్ఈసీ చెప్పినా సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.