తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) జాతీయ పార్టీ అంకురార్పణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 14న ఢిల్లీలో కేంద్ర కార్యాలయాన్నిప్రారంభించనున్నారు. రాబోయే కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తామని కూడా కేసిఆర్ తెలిపారు. ఇదే క్రమంలో ఏపిలో పార్టీ కార్యాలయం ఏర్పాటునకు ఆ పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారనీ, విజయవాడలో రాష్ట్ర పార్టీ కార్యాలయం కోసం భవనాన్నికూడా చూస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. విజయవాడలో ఆయన అభిమానులు భారీ హోల్డింగ్ కూడా ఏర్పాటు చేశారు. విజయవాడ లో పార్టీ కార్యాలయం చూసేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రానున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ ఏపిలో ఎంట్రీపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కేసిఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై సజ్జల స్పందిస్తూ.. బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని కేసిఆర్ కోరితే ఆలోచిస్తామని తెలిపారు. ఒక వేళ అలాంటి ప్రతిపాదన ఏమైనా ఉంటే సీఎం వైఎస్ జగన్ అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రాజకీయ పార్టీగా ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చని అన్నారు. తమ పార్టీకి కర్ణాటక, తమిళనాడులో పోటీ చేసే ఉద్దేశం లేదని తెలిపారు. ఏపి సంక్షేమం, అభివృద్ధి తప్ప సీఎం జగన్ కు వేరే ఆలోచన లేదని సజ్జల స్పష్టం చేశారు. ఏపిలో బీఆర్ఎస్ పోటీ చేస్తే మంచిదేనని అభిప్రాయపడ్డారు. అయితే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే ఆలోచన వైసీపీకి లేదని అన్నారు.
సమైక్యం కోసం నిలబడిన ఏకైక పార్టీ వైసీపీయేనని సజ్జల అన్నారు. ఏనిమిదేళ్లు అవుతున్నా విభజన పై విచారణ జరుగుతూనే ఉందని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను రాజకీయం చేయాల్సిన అవసరం లేదని సజ్జల అన్నారు.