Chandra Babu: కుప్పంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారనీ, అధికారులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తున్నారనీ, దొంగ ఓట్లు వేస్తున్నారనీ టీడీపి అధినేత చంద్రబాబు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. దశాబ్దాలుగా నిర్మించుకున్న తన సొంత నియోజకవర్గం కుప్పం కోట బద్దలు అవుతుండటంతో చంద్రబాబులో అసహనం పెరిగిపోయి ఓటమికి సాకులు వెతుక్కుంటూ మతి భ్రమించినవాడిలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. చిన్న మున్సిపాలిటీ కోసం చంద్రబాబు తోక తెగిన బల్లిలా గిలగిలా కొట్టుకుంటున్నారని సజ్జల ఎద్దేవా చేశారు.
Chandra Babu: కుప్పంలో గెలుపు ఖాయం
కుప్పంలో దొంగ ఓట్ల వేయించడం, వేరే ప్రాంతాల నుండి జనాలను తరలించడం ఇంత కాలం చంద్రబాబు చేస్తూ వచ్చినవేననీ, ఇప్పటికీ కుప్పంలో వేల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. ఓటర్లకు డబ్బులు, ముక్కు పుడకలు, ఇతర తాయిలాలు పంపిణీ చేస్తూ టీడీపీ కార్యకర్తలు అడ్డంగా దొరికిపోయారంటూ వీడియోలను మీడియా ముందు ప్రదర్శించారు సజ్జల. తాము అధికార దుర్వినియోగానికి పాల్పడితే టీడీపీకి చెందిన వందలాది మంది కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చి డౌన్ డౌన్ అని అరవగలరా ?, చిత్తూరు వైసీపీ ఎంపిని బయటకు రానివ్వకుండా నిర్బంధించగలరా ? అని సజ్జల ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు వైసీపీని ఆశీర్వదిస్తున్నారని అన్నారు. వైసీపీ ఎన్నడూ దిగజారుడు విధానాలకు పోలేదు, పోదు అని సజ్జల స్పష్టం చేస్తూ కుప్పంలో వైసీపీ గెలుపు ఖాయమని పేర్కొన్నారు.
చంద్రబాబు ప్రెస్ మీట్ చూస్తే ఆయన ఈ జన్మకు మారడు అనేది స్పష్టం అవుతుందని, చంద్రబాబు మాట్లాడినవన్నీ ఆయనకే వర్తిస్తాయని సజ్జల అన్నారు. తమ ఏజెంట్ లను అరెస్టు చేశారనీ చంద్రబాబు అంటున్నారు అసలు ఏజెంట్లుగా రౌడీ షీటర్లను ఎందుకు పెట్టారని సజ్జల ప్రశ్నించారు. కుప్పంలో ఘోరంగా ఓటమి పాలవుతున్నారు కాబట్టే ఘోరాలు జరుగుతున్నాయని ప్రపంచాన్ని నమ్మించడానికి చంద్రబాబు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు.