Sajjala Rama Krishna Reddy: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు భేటీ అయ్యాయి. నిన్న ఉద్యోగ సంఘాలతో చర్చించిన అంశాలతో పాటు ఉద్యోగులకు ఎంత మేర పీఆర్సీ ఇవ్వాలనే విషయాలపై సీఎం జగన్ తో చర్చించారు. సీఎస్ కమిటీ సిఫార్సు చేసిన పీఆర్సీని ఒప్పుకునేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ తో చర్చించిన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ ఈ రోజు ఆయా సంఘాల నేతలతో మరో సారి సమావేశమవుతారని సజ్జల తెలిపారు.
Sajjala Rama Krishna Reddy: రేపు లేదా సోమవారం సీఎంతో సమావేశం
ఉద్యోగులకు ప్రస్తుతం 27 శాతం ఐఆర్ ఇస్తున్నామనీ, గ్రాస్ వేతనం తగ్గకుండా చర్యలు తీసుకుంటామని సజ్జల చెప్పారు. ఉద్యోగుల మిగిలిన డిమాండ్ల పైనా చర్చించామన్న సజ్జల ..అన్నింటిని క్రమంగా పరిష్కరిస్తామని తెలిపారు. కరోనా పరిస్థితుల కారణంగా కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు రాకపోవడంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సరిగాలేదని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడిస్తున్న ఐఆర్ 27 శాతం కంటే ఎక్కువగానే లబ్ది చేకూరేలా ఉంటుందని పేర్కొన్నారు. పీఆర్సీపై రేపటిలోగా చర్చల ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు సజ్జల. ఉద్యోగ సంఘాల నేతలతో రేపు లేదా సోమవారం సీఎం జగన్ చర్చలు ఉండవచ్చని అన్నారు. సీఎంను ఉద్యోగ సంఘాల నేతలు కలిసిన తర్వాతే పీఆర్సీపై ప్రకటన చేయడం జరుగుతుందని సజ్జల అన్నారు.