33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ రాజధానిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల కీలక కామెంట్స్.. బుగ్గన వ్యాఖ్యలు వక్రీకరించారంటూ..

Share

ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాజధానిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయిన నేపథ్యంలో ఏపి ప్రభుత్వ నిర్ణయాన్ని మరో సారి స్పష్టం చేస్తూ కీలక కామెంట్స్ చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వికేంద్రీకరణకే తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజధానిని ఒకే చోట కేంద్రీకృతం చేశారనీ, విభజన తర్వాత కూడా చంద్రబాబు పరిపాలనలో కూడా శాసన, న్యాయ, పరిపాలన రాజధానులన్నీ ఒకే చోట పెట్టి దానికి అమరావతి అని నామకరణం చేశారన్నారు.  జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకున్నారన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వికేంద్రీకరణ రాష్ట్రానికి అవసరం అని గుర్తించామనీ, వికేంద్రీకరణకే తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. పరిపాలనను వికేంద్రీకరణ చేయడంలో భాగంగా ప్రధాన విభాగాలు మూడింటిని మూడు ప్రాంతాలో పెట్టాలని బిల్లు తీసుకొచ్చామనీ, అయితే అది అది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉందనీ, తాము తమ వాదనలు వినిపిస్తున్నామన్నారు.

sajjala Rama Krishna Reddy

కన్ఫ్యూజన్ సృష్టిస్తున్నది ఎల్లో మీడియానే

నిన్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చెప్పింది కూడా వికేంద్రీకరణ గురించేననీ, ఎల్లో మీడియా ఆయన మాటలను వక్రీకరించి,  ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ సృష్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు సజ్జల. పరిపాల వికేంద్రీకరణలో భాగంగా.. మంత్రి వర్గం, సెక్రటేరియట్, ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖలో ఉంటుందన్నారు. అసెంబ్లీ అమరావతిలోనే ఉంటుందనీ, హైకోర్టు, న్యాయ సముదాయాలు కర్నూలులో ఉంటాయని తెలిపారు. వాటిని క్యాపిటల్‌ అనేది తాము ఇచ్చుకున్న నిర్వచనమనీ, ఇందులో వైరుధ్యం ఏమీ లేదన్నారు. సుప్రీంలో తాము వాదించేది కూడా అదేననీ, ఇంకా అందరి సూచనలు తీసుకుంటామని తెలిపారు. వికేంద్రీకరణకు చట్ట రూపం ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా మా విధానంలో మార్పు ఉండదని చెప్పారు. అందులో భాగంగా ప్రధాన వ్యవస్థలను మూడు ప్రాంతాల్లో పెట్టడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. కింది స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి గారు ప్రజలు గడప వద్దకే తీసుకెళ్లారని అన్నారు. పాలన వికేంద్రీకరణలో భాగంగానే 13 జిల్లాలు… 26 జిల్లాలు అయ్యాయన్నారు. బుగ్గన ప్రసంగం మొత్తంలో ఎటువంటి వివాదాస్పదం లేదనీ, ఆయన మాట్లాడిన దానిని ఎల్లో మీడియా వక్రీకరించి పైశాచిక ఆనందం పొందాలనే తపనతో రాసిన రాతలేనని దుయ్యబట్టారు. ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించాలనే భావనతో అలా రాసి ఉంటారని అన్నారు సజ్జల. బుగ్గన చెప్పిన దాంట్లో ఎటువంటి గందరగోళానికి అవకాశం లేదన్నారు. ముఖ్యమంత్రి గారు ఒక చోట ఉంటే.. మిగతావి వేరే చోట ఉంటాయనే చెప్పారన్నారు. “మా అమరావతిలోనే అన్నీ ఉంటాయి.. రాజధాని ఎక్కడకూ వెళ్లదు” అని చెప్పే ప్రయత్నం ఎల్లో మీడియా చేస్తోందని విమర్శించారు.  ప్రభుత్వంలోనే ఏకాభిప్రాయం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని దయ్యబట్టారు. ఎవరైతే అమరావతిలోనే రాజధాని ఉండాలి.. ఇక్కడి మా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగుండాలని కోరుకుంటున్నారో వాళ్ళే ఇలాంటి వాదనలు చేస్తున్నారని విమర్శించారు.  అన్నిటి కంటే ముఖ్యంగా సుప్రీం కోర్టులో తమ వాదన కానీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చెప్తున్న విషయాల్లో కానీ వికేంద్రీకరణే ప్రధానం అవుతుందన్నారు. మేం ప్రజలకు చెప్పేది మాత్రం ఒకటేననీ .. ఎల్లో మీడియా, టీడీపీ కలిసి చేసే గందరగోళాన్ని నమ్మొద్దని హితవు పలికారు. పరిపాలన రాజధాని విశాఖలో, శాసన రాజధాని అమరావతిలో, న్యాయ రాజధాని కర్నూలులో ఉంటుంది..ఇదే వాస్తవం అని సజ్జల స్పష్టం చేశారు.

కోర్టులకు వెళ్ళి అడ్డుకోకుండా ఉంటే.. వికేంద్రీకరణ ఎప్పుడో జరిగేది

ఎన్నికలకు వెళ్లడం కోసం మూడు రాజధానుల అంశాన్ని తాము తెరమీదకు  తీసుకురాలేదనీ, మొదటి నుంచీ మా విధానం వికేంద్రీకరణేననీ, అందులో భాగంగానే, తాము అధికారంలోకి వచ్చాక,  ఆ విధానాన్ని అసెంబ్లీలో పెట్టామనీ,  వాళ్లే కోర్టులకు వెళ్లి, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ,  వికేంద్రీకరణను అడ్డుకుంటూ ఆలస్యం చేశారనీ, లేదంటే ఈ పాటికి వికేంద్రీకరణ జరిగి ఉండేదని అన్నారు సజ్జల. ఖచ్చితంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వికేంద్రీకరణ నినాదంతో ఎన్నికలకు వెళ్తుందనీ, దానికి ప్రజల ఆదరణ కూడా ఉందని తెలిపారు. వికేంద్రీకరణకు ప్రజల్లో ఆదరణ ఉంది కాబట్టే.. అమరావతి రైతుల పేరుతో చేసిన పాదయాత్రకు కోర్టు అనుమతించినా, వారు మధ్యలోనే ఆపేసి వెనక్కి వచ్చారని అన్నారు. ఇదొక్క నినాదంతోనే ఎన్నికలకు వెళ్లమనీ, జగన్మోహన్‌రెడ్డి గారు చేసిన పనులు చాలా ఉన్నాయి.. అందులో వికేంద్రీకరణ కూడా ఒక భాగమని చెప్పారు.  జనసేన మోస్తున్న చంద్రబాబులా.. ఎన్నికల కోసం ఒక నినాదం.. తర్వాత మరోక నినాదాన్ని జగన్మోహన్‌రెడ్డి నమ్ముకుని లేరని అన్నారు.

సుప్రీం కోర్టు తీర్పును అనుసరించే విశాఖకు వెళ్తామని అన్నారు సజ్జల. విశాఖకు వెళ్ళేది సిఎం గారి క్యాంపు కార్యాలయమా..? మొత్తం వ్యవస్థా.. అన్నది కోర్టు తీర్పుకు లోబడే ఉంటుందన్నారు. ఎవర్నో మోసం చేసి అడ్డంగా వెళ్లాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. రాజ్యాంగం ప్రకారం చూసినా రాజధాని ఎక్కడ ఉండాలనేది, పరిపాలన ఎక్కడ్నుంచి చేయాలి అనేది కచ్చితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాబట్టే ఆనాడు చంద్రబాబు అమరావతి అన్నారన్నారు. పదేళ్లు హైదరాబాద్‌లో అవకాశం ఉన్నా ఓటుకు నోటు కేసు వల్ల హడావుడిగా అర్ధరాత్రి అమరావతికి వచ్చారని విమర్శించారు. అమరావతిపై.. పది రోజుల కమిటీ అయిన నారాయణ కమిటీ వేసి, దాని నుంచి నివేదిక తీసుకున్నాడనన్నారు. వికేంద్రీకరణ దిశగా కేంద్రం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులను లెక్కచేయకుండా పక్కకు తోసేశారని గుర్తు చేశారు. ఎవరితో చర్చించకుండా తనంతట తానుగా ఏకపక్షంగా అమరావతిని చంద్రబాబు డిక్లేర్‌ చేసుకున్నారన్నారు. ఆ రోజు జగన్మోహన్‌రెడ్డి ఎక్కడ రాజధాని పెట్టినా 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే బాగుంటుందని సలహా ఇచ్చారనీ, అది రాష్ట్రప్రభుత్వ నిర్ణయం కాబట్టే తాము సలహా మాత్రమే ఇవ్వగలిగామని చెప్పారు. అదే ఇప్పటికీ వర్తిస్తుందనీ, చంద్రబాబు రాజధాని అంతా పూర్తి చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో తెలియదన్నారు. రాజధాని నిర్మాణానికి చంద్రబాబు పెట్టిన ప్రతిపాదనలు చూస్తే రెండు మూడు బడ్జెట్లు కూడా సరిపవనీ, దాని నిర్మాణానికి కనీసం ఇరవై ఏళ్లకు పైగా సమయం పట్టేదన్నారు. మౌలిక వసతులు కల్పించకపోతే అక్కడ రాజధాని అనేది ఊహకు కూడా అందని విషయమన్నారు. అమరావతి రాజధాని నిర్మాణ వ్యయమే లక్ష కోట్లు అని ఆయనే లెక్కవేసిన నేపథ్యంలో…దాన్ని భరించే పరిస్థితి రాష్ట్రానికి లేనప్పుడు వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

తాము పదే పదే రాజధానుల గురించి మాట్లాడటం లేదనీ, వాళ్లే రోజూ మాట్లాడుతున్నారని సజ్జల అన్నారు. అమరావతే మా రాజధాని అంటూ రాష్ట్రమంతా అదే కోరుకుంటుందని టీడీపీ, ఎల్లో మీడియా చెప్పే ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకే తాము మాట్లాడుతున్నామని వివరించారు. విశాఖకు ఉన్న పొటెన్షియల్‌ ఎలాగూ ఉంది..రాజధాని అయితే అదనపు అవకాశం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి అక్కడ ఉంటారు కాబట్టి ఇంకా పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం అవుతుందని సీఎం చెప్పారన్నారు. విశాఖ అనేది ఏమైనా ఒడిశాలో ఉందా..?. విశాఖలో పరిపాలనా రాజధాని వస్తే… టీడీపీకి బాధేంటో తనకు అర్ధం కావడం లేదని సజ్జల అన్నారు. పరిశ్రమలన్నీ విశాఖకు వస్తే వీళ్లకు ఎందుకంత కడుపుమంట..రావద్దనుకుంటున్నారా..అని ప్రశ్నించారు. అక్కడ పోర్ట్‌ ఉంది… కోస్టల్‌ లైన్‌ ఉంది…క్యాపిటల్‌ ఉంది.. పవర్‌ సెంటర్‌ అక్కడ ఉంటే పారిశ్రామిక వేత్తలకు వెసులుబాటు ఉంటుందన్నారు. ఇన్వెస్టర్లను ఎట్రాక్ట్‌ చేయడానికి ఉన్న అవకాశాలన్నిటినీ తాము వాడుకుంటామనీ, అందులో తప్పేముందన్నారు. కేంద్రం కూడా రాజధాని ఎంపిక నిర్ణయం అన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే అన్న మాటను మాత్రం టీడీపీ- ఎల్లో మీడియా చెప్పడం లేదన్నారు. రేపు కోర్టులో కూడా అదే ఉంటుందని తాము ఆశిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూర్చోవాలి అనేది రాష్ట్రం నిర్ణయించుకుంటుంది కానీ కేంద్రం కాదు కదా అని అన్నారు. ఒక వేళ కేంద్రమే చేయాల్సి వస్తే..  దానికి కావాల్సిన లక్ష కోట్లు వాళ్లిస్తారా.. అని ప్రశ్నించారు. రాజ్యాంగ పరంగా కూడా అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే… సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్‌ అవుతుందని సజ్జల స్పష్టం చేశారు.

ఏపి లో హాట్ టాపిక్ గా మారిన రాజధానిపై బుగ్గన సెన్షేషనల్ కామెంట్స్ .. మళ్ళీ తూచ్ అంటారా..?


Share

Related posts

aishwarya rajesh : తెలుగమ్మాయి భారీగా డిమాండ్ చేస్తోందా..?

GRK

Oshea Herbals Review: ఓషియా హెర్బల్స్ హెయిర్ గ్రోత్ షాంపూ లో ఏముంటుంది? జుట్టు పెరగడానికి ఈ షాంపూ వాడిన వారు ఏమంటున్నారు?

bharani jella

Allu Arjun Pushpa : షూటింగ్ లో తీవ్ర విషాదం , ఆసుపత్రి కి తీసుకెళ్తూ ఉండగా చనిపోయాడు.

bharani jella