Ex Minister Narayana: పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో టీడీపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు పి నారాయణను పోలీసులు అరెస్టు చేయగా చిత్తూరు మెజిస్ట్రేట్ వ్యక్తిగత పూచికత్తులతో బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే పక్కా అధారాలతో నిందితుడు నారాయణను అరెస్టు చేస్తే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు రాజకీయ కక్షసాధింపు చర్య అని పేర్కొనడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నారాయణ విద్యా సంస్థల్లో జరిగింది ప్రశ్నపత్రాల లీక్ కాదనీ, పరీక్ష ప్రారంభం కాగానే పేపర్ను ఫోటో తీసి కొందరి వద్దకు పంపి సమాధానాలు రాయించి వాటిని విద్యార్థులకు చూపడం ద్వారా నూటికి నూరు శాతం ఫలితాలు సాధించే లక్ష్యంతో మొత్తం వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఈ వ్యవహారం జరిపారని అన్నారు సజ్జల.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి సాఫీగా సాగిపోయింది
మరో వైపు పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందంటూ టీడీపీ విమర్శలు చేస్తోందనీ, దీనిపై సీరియస్గా స్పందించిన సీఎం వైఎస్ జగన్..తప్పు ఎవరు చేసినా వదిలి పెట్టొద్దని స్పష్టం చేశారన్నారు. ఆ ప్రక్రియలోనే నారాయణను అరెస్టు చేశారన్నారు. నిజానికి గతంలో కూడా నారాయణ విద్యా సంస్థల్లో ప్రశ్నపత్రాలు బయటకు తీసుకురావడం, తద్వారా మంచి ఫలితాలు వచ్చేలా చూడడం కొనసాగిందనీ అయితే ఆప్పట్లో ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి అంతా సాఫీగా జరిగిపోయిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి రెండేళ్లు కోవిడ్ వల్ల పరీక్షలు జరగలేదనీ, ఈసారి పరీక్షలు నిర్వహించడంతో ఆ విద్యా సంస్థల్లో జరుగుతున్న అక్రమ వ్యవహారం బయట పడిందన్నారు సజ్జల.
నిందితులు ఇచ్చిన నేర అంగీకార స్టేట్మెంట్ ఆధారంగానే..
ప్రశ్నాపత్రాలు బయటకు వచ్చిన తర్వాత అదుపులోకి తీసుకున్న నిందితులు ఇచ్చిన నేర అంగీకార స్టేట్మెంట్ ప్రకారమే నారాయణను అదుపులోకి తీసుకున్నారని సజ్జల పేర్కొన్నారు. ఇది రాజకీయ కక్ష అని గగ్గొలు పెడుతున్న చంద్రబాబు.. కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారనీ. నిన్న ఉదయం నుంచి క్షణం తీరిక లేకుండా న్యాయ కోవిదులు, మేధావులతో సీరియస్గా చర్చించారని అన్నారు. ఒక గొప్ప మేధావి, సంఘ సంస్కర్తను అరెస్టు చేస్తే, ఎలా వ్యవహరిస్తారో.. నారాయణను అరెస్టు చేయగానే, చంద్రబాబు ఆ విధంగా పని చేశారన్నారు. అసలు నారాయణను అరెస్టు చేస్తే చంద్రబాబు ఎందుకు అంతగా భయపడుతున్నారు? ఆ విద్యా సంస్థల వెనక చంద్రబాబు ఉన్నారా? అని సజ్జల ప్రశ్నించారు.
బెయిల్ రద్దుపై హైకోర్టుకు
నారాయణ 2014లోనే ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి ఉండొచ్చు కానీ ఆయనే అన్నీ చూసుకుంటున్నారన్నారు. ఈ మాల్ ప్రాక్టీస్ పూర్తిగా నారాయణ కనుసన్నల్లోనే జరుగుతోందని సిబ్బంది స్వయంగా చెప్పినా బెయిల్ రావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. నారాయణ బెయిల్ రద్దుపై హైకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం భావిస్తొందని చెప్పారు. సాంకేతికపరంగా నారాయణ విద్యాసంస్థకు ఛైర్మన్ కాకపోవచ్చు ఆయన అల్లుడు ఇప్పుడు ఆ సంస్థలు చూస్తుంటే రేపు ఆయనను అదుపులోకి తీసుకున్నా టీడీపీ ఇలాగే స్పందిస్తుందా? అని సజ్జల ప్రశ్నించారు.