Volunteer : ఏపిలో వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారుల ఇళ్లవద్దనే అందించాలన్న లక్ష్యంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. 50 నుండి 60 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని 2.7లక్షల మంది ఎంపిక చేశారు. వీరికి కేవలం అయిదు వేల గౌరవ భృతి ఇస్తున్నప్పటికీ వాలంటీర్ లు వారి పరిధిలోని కుటుంబాలకు ప్రభుత్వ సేవలు అందిస్తున్నారు. ప్రతి నెలా ఫించన్లను నేరుగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి అందిస్తున్నారు. ప్రభుత్వం పేద వర్గాలకు ఏ పథకం తీసుకువచ్చినా వాటిని ప్రజలకు అందించడంలో వాలంటీర్లు కీలక భూమిక పోషిస్తున్నారు. ఎక్కడో కొన్ని చూట్ల మినహా ఏక్కువ ప్రాంతాల్లో వాలంటీర్లు వారి పరిధిలోని కుటుంబాలతో మమేకమవుతూ ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల కంటే మిన్నగా వాలంటీర్ల సేవలు
ఇటీవల కాలం వరకూ వారు తాము ప్రభుత్వ ఉద్యోగులమే అన్న భావనతో పని ఉన్నా లేకపోయినా ఉదయం కార్యాలయానికి వెళ్లి సాయంత్రం వరకూ ఉండి వారి పరిధిలోని లబ్దిదారులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. అయితే ఇటీవల తమ వేతనాలు పెంచాలంటూ ఆందోళన చేసిన సందర్భంలో సీఎం వైఎస్ జగన్ వాలంటీర్ లకు ఒక క్లారిటీ ఇచ్చేశారు. వాలంటీర్ అంటే స్వచ్చందంగా సేవా దృక్పదంతో పని చేయడమనీ, వాలంటీర్లకు ఇస్తున్నది వేతనం కాదు, గౌరవ భృతి అని చెప్పారు. జీతం లేకుండా గౌరవ భృతితో వాలంటీర్లు పని చేయడం వల్లనే సమాజంలో వాలంటీర్లకు మంచి గౌరవం, గుర్తింపు లబిస్తున్నాయన్నారు. నిత్యం ఆఫీసుకు వెళ్లి కూర్చోవాల్సిన అవసరం లేదనీ అవసరమైన సమయాల్లోనే వీరు కార్యాలయానికి వెళ్లవచ్చని చెప్పేశారు.
Volunteer : వాలంటీర్లను ఆదరిస్తున్న లబ్దిదారులు
ఆ విషయాలను పక్కన పెడితే వాలంటీర్ లు అందిస్తున్న సేవలకు ఎంత గుర్తింపు వచ్చింది అంటే అనంతపురం జిల్లాలో రాప్తాడు నియోజకవర్గంలో ఓ వాలంటీర్ను ఏకంగా సర్పంచ్ పదవినే కట్టబెట్టారు. పోటీ అనేది లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పరిస్థితి చూస్తే వాలంటీర్లను లబ్దిదారులు ఏ విధంగా అభిమానిస్తున్నారనేది అర్థం అవుతుంది. పలు గ్రామాల్లో వాలంటీర్ల ప్రభావంతో పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఓటమి పాలైయ్యారనే మాట కూడా వినిపిస్తోంది. గ్రామాల్లో, పట్టణాల్లో ఓటర్లను ప్రభావితం చేసే స్థాయిలో కొన్ని ప్రాంతాల్లో వాలంటీర్లు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లాలో పది మంది వాలంటీర్లను ఎటువంటి విచారణ లేకుండా అధికారులు తొలగిస్తే వారిని తక్షణం విధుల్లోకి తీసుకోవాలంటూ గ్రామస్తులు ధర్నా నిర్వహించారంటే గ్రామాల్లో వారు పొందుతున్న అభిమానం అర్థం అవుతుంది.
వేతనం 18వేలు చేస్తామంటూ టీడీపీ ఎమ్మెల్యే హామీ
ప్రస్తుత మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికలు జరుగుతున్న వేళ వాలంటీర్లను తమ వైపునకు తిప్పుకుంటే లాభం జరుగుతుందని టీడీపీ భావించినట్లు ఉంది. భారీ మొత్తంలో జీతాలు పెంచుతామంటూ టీడీపీ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ తమ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల వేతనాలను రూ.5వేల నుండి రూ.18వేలు చేస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. కేవలం రూ.5వేలు ఇచ్చి వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లతో గొడ్డు చాకిరి చేయించుకుంటోందని అన్నారు. అంతే కాకుండా వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచనే అని, కానీ దాన్ని కాపీ కొట్టి వైసీపీ ప్రభుత్వం అమలు చేసిందని గద్దే వ్యాఖ్యానించారు. ఎన్నికల వేళ గద్దే చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇచ్చిన ఈ హామీకి అంత వాల్యూ లేకపోయినా వాలంటీర్లు చేజారి పోకుండా ఉండేందుకు జగన్మోహనరెడ్డి సర్కార్యే గౌరవ వేతనం పెంపు ఆలోచన చేయవచ్చనే మాట వినబడుతోంది.