Sangam dairy case: ఏపి హైకోర్టులో ప్రభుత్వానికి మరో సారి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల సంగం డెయిరీలో చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే, ఇదే క్రమంలో సంగం డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ జివో జారీ చేసింది. డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ ఇచ్చిన జీవోపై డైరెక్టర్ లు హైకోర్టును ఆశ్రయించగా నేడు విచారణ జరిపింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. సంగం డెయిరీ కార్యకలాపాలను డైరెక్టర్లు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రోజువారి కార్యకలాపాలను డైరెక్టర్ లు పర్యవేక్షించాలని హైకోర్టు సూచించింది. డెయిరీ ఆస్తుల అమ్మకంపై కోర్టు అనుమతి తీసుకోవాలని తెలిపింది.
అదే విధంగా సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర క్వాష్ పిటిషన్ పై నా హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ పై స్టే ఇవ్వాలని ధూళిపాళ్ల తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే దూళిపాళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంత విచారణ చేయలేని పరిస్థితి ఉందని అధికారులు తెలిపారు. కస్టడీ పొడిగింపు అభ్యర్థన పై ఏసీబీ కోర్టునే విచారణ చేయమని హైకోర్టు సూచించింది. కాగా సంగం డెయిరీ సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులకు పోలీసులు ఇస్తున్నారని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను జూన్ 17కు హైకోర్టు వాయిదా వేసింది.