కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ సర్కార్ లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏపి పునర్విభజన చట్టం, రెండు రాష్ట్రాల(ఏపి, తెలంగాణ) ఆస్తుల పంపకాలపై ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఏపి తెలంగాణ రాష్ట్రాల విభజన జరిగి తొమ్మిది సంవత్సరాలు కావస్తున్నా విభజన చట్టంలోని షెడ్యుల్ 9,10 సంస్థల విభజన జరగలేదు. దీంతో ఏపి సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు స్పందించింది.
కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది. రిజైన్డర్ దాఖలునకు ఏపికి నాలుగు వారాల సమయం ఇచ్చింది సుప్రీం కోర్టు. ఈ పిటిషన్ విచారణ సందర్భంలో తెలంగాణ, కేంద్రం తరపున న్యాయవాదులు హజరు కాలేదు. షెడ్యుల్ 9,10 సంస్థలు 91 శాతం తెలంగాణలో ఉన్నాయనీ, వాటి ఆస్తుల విలువ సుమారు రూ.1,42,601 కోట్లని ఏపి సర్కార్ పేర్కొంది. ఈ అంశంపై తెలంగాణ సర్కార్ స్పందించకపోవడం ప్రాధమిక హక్కుల ఉల్లంఘనేనని తెలిపింది. ఏపి ప్రభుత్వ పిటిషన్ పై తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.