SEB Ride: గుంటూరు జిల్లాలో నాటుసారా విక్రేతల వ్యూహం అధికారులనే విస్మయానికి గురి చేసింది. సాధారణంగా నాటు సారాయి తయారీ దారులు తమ స్థావరాలను నిర్జన ప్రదేశాల్లో, గ్రామాలకు దూరంగా పొలంలో గానీ అటవీ ప్రాంతాల్లో గానీ పెట్టుకుని సారాయి ఉత్పత్తి చేస్తుంటారు. ఆయా ప్రదేశాల్లో సారా బట్టీలు ఏర్పాటు చేస్తే ఎక్సైజ్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఈజీగా గుర్తిస్తారు అనుకున్నారేమో సారా మాఫియా నిర్వహకులు ఓ వినూత్న ఐడియా వేశారు. గ్రామం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ పాఠశాలనే నాటు సారా తయారీకి అడ్డాగా చేసుకుంటే ఎవరికీ అనుమానం రాదు, అధికారులు అటు వైపు కన్నెత్తి చూడరు అనుకున్నారేమో ఆ దిశగా తమ అక్రమ వ్యాపారానికి తెర తీశారు.
Read More: Sajjala Rama Krishna Reddy: చంద్రబాబు సవాల్ కు వైసీపీ నేత సజ్జల కౌంటర్ ఇదీ..!!
కరోనా నేపథ్యంలో నెలల తరబడి పాఠశాలలకు సెలవులు కావడంతో తెరవడం లేదు. ఇదే అదనుగా భావించిన నాటు సారా తయారీదారులు దర్జాగా పాఠశాల ఆవరణలోనే సారా తయారీ బట్టీ పెట్టేశారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం హరీస్పేట ప్రాధమిక పాఠశాల గది బయట తాళం వేసి లోపల గ్యాస్ స్టవ్ లతో నాటు సారా తయారీ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ (ఎస్ఈబీ) సీఐ శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పాఠశాలలో సారా తయారీకి ఉపయోగించే ముడి సరుకులను స్వాధీనం చేసుకున్నారు.
పాఠశాలలో సారా తయారీ చేస్తుండటం చూసి ఎస్ఈబీ అధికారులే అవాక్కు అయ్యారు. ఈ విషయం తెలిసి గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాఠశాలను మద్యం తయారీకి అడ్డాగా మార్చడం ఆందోళన కల్గిస్తోంది. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు ఏమి చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన వెలుగు చూడటంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.