SEC : ఆంధ్రప్రదేశ్ AP లో గ్రామ పంచాయతీ ఎన్నికల Local body elections నేపథ్యంలో ప్రభుత్వం, ఎస్ఈసీ SEC మధ్య తీవ్ర విబేధాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో వివాదం చోటుచేసుకుంది. ఎన్నికల సంఘం ఏది చేసినా ప్రభుత్వానికి చెప్పి చేయాలి, ప్రభుత్వ అనుమతి లేకుండా ఏమి చేయడానికి వీలులేదు అన్నది ప్రభుత్వ వాదన అయితే ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) స్వయం ప్రతిపత్తి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వానికి జవాబుదారీ సంస్థ కాదు అనేది ఎస్ఈసీ అభిప్రాయం. ఈ రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య జరుగుతున్న ఫైట్ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇప్పుడు తాజాగా వచ్చిన విషయం ఏమిటంటే..ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓ కొత్త యాప్ ను తీసుకువచ్చారు. ఈ వాచ్ యాప్ ను బుధవారం ఆయన ఆవిష్కరించారు. అయితే ఈ వాచ్ యాప్ పై ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం పారదర్శకతకు పాతర వేసిందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికల పర్యవేక్షణ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేటు యాప్ రూపొందించారనీ, ఈ బండారం బయట పడకుండా ఉండేందుకు ప్రభుత్వం నుండి భద్రతాపరమైన అనుమతులు తీసుకోకుండానే ఎన్నికల్లో వినియోగించాలని నిర్ణయించారనేది ఆరోపణ.
ఈ యాప్ పై నేడు ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా దీనిపై హైకోర్టు గురువారం విచారణ జరపనున్నది. ప్రభుత్వ విజ్ఞప్తిని పట్టించుకోకుండా ఎస్ఈసీ ప్రత్యేక యాప్ రూపొందించడంపై వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. యాప్ రూపకల్పన నుండి ప్రకటన వరకు ఎస్ఈసీ గోప్యత పాటించిందనీ, యాప్ రూపకల్పనపై అనేక అనుమానాలను వైసీపీ వ్యక్తం చేస్తోంది. ప్రజలు ప్రభుత్వ యాప్ లేదా సీఈసీ యాప్ ఉపయోగించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఓ పక్క హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ యాప్ ను ఆవిష్కరించారు. ఆ యాప్ ను ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, పిర్యాదులు ఏలా చేయవచ్చు తదితర విషయాలను ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబు తెలిపారు.