SEC : ఏపిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ వర్సెస్ ప్రభుత్వం వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రులు, వైసీీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. అత్యధికంగా ఏకగ్రీవాలు అయిన చిత్తూరు, గుంటూరు జిల్లాల పంచాయతీ ఫలితాలను వెల్లడించవద్దని ఎస్ఈసీ అదేశించిన విషయం తెలిసిందే. ఎస్ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైర్ అయ్యారు. జిల్లా అధికారులు ఎన్నికల కమిషనర్ ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఎన్నికల నిబంధనల మేరకు పని చేయాలని లేకుంటే ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత వారిపై చర్యలు తీసుకుంటామని పెద్దిరెడ్డి అధికారులను హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకూ అంటే ఈ నెల 21వ తేదీ వరకు ఇంటికే పరిమితం చేయాలని డీసీపి గౌతమ్ సవాంగ్ కు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. మంత్రి మీడియాతోనూ మాట్లాడటానికి అవకాశం ఇవ్వవద్దని తేల్చి చెప్పింది. ఎన్నికలు నిజాయితీగా, నిష్పక్షపాతంగా జరిగేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. ప్రజలు నిర్భయంగా ఓటు వేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఈసీ పేర్కొంది. రాష్ట్రంలో ఇటువంటి నిర్ణయం గతంలో ఎన్నడూ తీసుకున్నట్లు లేదు. రాష్ట్ర మంత్రిని దాదాపు 15 రోజులు హౌస్ అరెస్టు ఆదేశాలు ఇవ్వడం ఇదే ప్రధమం. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఈ ఉత్తర్వులపైనా హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని అంటున్నారు.
ఎస్ఈసీ నిర్ణయాన్ని డీజీపీ అమలు చేస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంత వరకూ తనకు ఎస్ఈసీ ఆదేశాలు అందజేదని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి విషయంలో ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. గతంలోనూ ఎస్ఈసీ ఆదేశించిన పలు ఆదేశాలను ప్రభుత్వం తిరస్కరించింది అదే విధంగా మంత్రిని గృహ నిర్బంధం చేయడం సాధ్యం కాదని లేఖ రాసే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రిని గృహ నిర్బంధం చేస్తే శాంతి భద్రతల సమస్య ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కూడా పేర్కొంటూ ఎస్ఈసీ ఆదేశాలను పునః పరిశీలన చేయాలని కోరే అవకాశం కూడా ఉందని పలువురు పేర్కొంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో.