SEC App : ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికలకు గానూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నూతనంగా తీసుకువచ్చి ఆవిష్కరించిన ఈ వాట్ యాప్ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ యాప్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది.
యాప్ రూపొందించడంలో సాంఘీక సంక్షేమ శాఖ రూపొందించిన సోర్స్ ను ఉపయోగించినట్లు గుర్తించామని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. వాళ్ల అనుమతి తీసుకున్నారో లేదో తెలసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. మొత్తం 24 అంశాలపై కొర్రీలకు సమాధానం ఇవ్వాలని లేఖ రాసినట్లు చెప్పారు. సమాధానం వచ్చిన తరువాత యాప్ సర్టిఫికేషన్ పై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. అయితే ఏపి టెక్నాలజీ సర్వీసెస్ సెక్యూరిటీ సర్టిఫికెట్ కు అభ్యంతరాలు తెలియజేసినందున ఈ వాచ్ యాప్ ను ఉప సంహరించుకుంటామని ఎస్ఈసీ న్యాయవాది హైకోర్టు తెలిపారు.
ఇదే సందర్భంలో ప్రభుత్వ నిఘా యాప్ పని చేయడం లేదని ఎస్ఈసీ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. సీ విజిల్ యాప్ ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వ యాప్ లేదా సీ విజిల్ యాప్ ఉపయోగించుకుంటే అభ్యంతరం ఏమైనా ఉందా అని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. తమకేమీ అభ్యంతరం లేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.