SEC : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గత ఏడాది మార్చి నెలలో నామినేషన్ లు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే నాడు నామినేషన్ లు దాఖలు చేసిన వారిలో వివిధ పార్టీలకు చెందిన వారు కొందరు ఈ ఏడాది కాలంలో మృతి చెందారు. మున్సిపల్ ఎన్నికలకు ఎస్ఈసీ రీ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు అభ్యర్థులు మృతి చెందిన స్థానాల్లో మళ్లీ నామినేషన్ లకు అవకాశం కల్పించాలని ఎస్ఈసీ ని కోరాయి. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు మున్సిపల్ ఎన్నికలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ లు వేసి చనిపోయిన వారి స్థానాల్లో మళ్లీ నామినేషన్ లు వేసేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 56 వార్డుల్లో మళ్లీ నామినేషన్ లు వేసేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 28వ తేదీన నామినేషన్ల స్వీకరణ, మార్చి ఒకటిన స్క్రూటినీ, మార్చి 3న ఉపసంహరణ, అదే రోజు తుది జాబితా ప్రకటన, పదవ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. వైసీపీ నుండి 28, టీడీపీ నుండి 17, బీజెపీ నుండి అయిదుగురు, సిపీఐ నుండి ముగ్గురు, కాంగ్రెస్ నుండి ఇద్దరు, జనసేన నుండి ఒకరు నామినేషన్ లు వేసి మరణించినట్లు ఎస్ఈసీ ప్రకటించింది.