విశాఖపట్నంలోని సీబీఐ ప్రత్యేక కోర్టులోని రెండు కోర్టులు ఏపిలోని ఇతర ప్రాంతాలకు తరలనున్నాయి. ఈ మేరకు ఏపి హైకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపికి సంబంధించిన సీబీఐ కేసులు అన్నీ విశాఖపట్నంలోని సీబీఐ కోర్టులోనే విచారణ జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన కేసులను కూడా విశాఖలోని సీబీఐ ప్రత్యేక కోర్టులే విచారిస్తున్న నేపథ్యంలో విశాఖలోని సీబీఐ కోర్టులను కర్నూలు, విజయవాడకు తరలిస్తూ నిర్ణయం తీసుకుంది.
విశాఖలో ఒకటో అదనపు సీబీఐ కోర్టుతో పాటు రెండో అదనపు సీబీఐ కోర్టు, మూడో అదనపు సీబీఐ కోర్టులు కొనసాగుతున్నాయి. వీటిలో ఒకటో అదనపు కోర్టును విశాఖలోనే ఉంచుతూ, రెండో అదనపు సీబీఐ కోర్టును కర్నూలుకు, మూడో అదనపు సీబీఐ కోర్టును విజయవాడకు తరలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు అడ్మిన్ రిజిస్టార్ విశాఖలోని ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జికి ఆదేశాలు జారీ చేశారు.
మరో పక్క అమరావతిలోని హైకోర్టును కర్నూలుకు తరలించాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో న్యాయవాదులు నిరసన దీక్షలు కొనసాగిస్తున్న తరుణంలో సీబీఐ కోర్టులు బదిలీ చేస్తూ ఉత్తర్వులు రావడం విశేషం. ఏపి ప్రభుత్వం.. మూడు రాజధానుల ప్రతిపాదనల్లో భాగంగా విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అమరావతిలోనే రాజధాని అభివృద్ధి పనులు కొనసాగించాలంటూ ఏపి హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణ అంశంపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.