రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఏమిదేళ్లు దాటింది. విభజన హామీ ప్రధానమైన డిమాండ్ ప్రత్యేక హోదా ఊసే మరిచింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. రాష్ట్రంలో 25 కి 25 పార్లమెంట్ స్థానాలు ఇస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికల ముందు ప్రకటించారు. మూడు తక్కువ 22 స్థానాలు వైసీపీకి వచ్చాయి. అయితే కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు మ్యాజిక్ ఫిగర్ కు మించి 303 స్థానాలు రావడంతో కేంద్రాన్ని ఒత్తిడి చేసే పరిస్థితి లేకుండా అయిపోయింది. కేంద్రాన్ని ప్రత్యేక హోదా కు అభ్యర్ధించడం తప్ప చేసేది ఏమీలేదు. ఈ విషయాన్ని ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలో మీడియా సమావేశంలోనే సీఎం జగన్ చెప్పేశారు. అయితే విభజన పాపంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రత్యేక హోదా పల్లవి ఎత్తుకుంది.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ఈ నెల 18న ఏపిలో ప్రవేశించనుంది. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో యాత్ర సన్నాహాకాలపై కర్నూలులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రాష్ట్ర నేతలతో సమావేశమైయ్యారు. సీనియర్ నేతలు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, ఉమెన్ చాందీ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్, నేతలు తులసిరెడ్డి, పళ్లంరాజు, హర్షకుమార్ తదితరులతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంలో సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ.. 2024 లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపికి ప్రత్యేక హోదా ఇస్తుందని స్పష్టం చేశారు. మొదటి సంతకం ప్రత్యేక హోదాపైనే తమ ప్రధాని పెడతారని ఆయన హామీ ఇచ్చారు.
ప్రస్తుత మోడీ పాలనలో దేశంలో ఆర్ధిక, సామాజిక అసమానతలు తీవ్రంగా పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ నేతలు అన్నారు. వీటి నుండి ప్రజలను కాపాడేందుకే కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఇదే సందర్భంలో తెలంగాణ సీఎం కేసిఆర్ ఏర్పాటు చేస్తున్న జాతీయ పార్టీపైనా విమర్శలు చేశారు. కేసిఆర్ ప్రారంభించేది బీఆర్ఎస్ పార్టీ కాదనీ, 2024 లో విఆర్ఎస్ తీసుకునే పార్టీగా సెటైర్ వేశారు.