సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మరో సారి హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తనపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని హైకోర్టును ఆశ్రయించిన ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు తాజాగా ప్రభుత్వం పై కోర్టు దిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. సస్పెన్షన్ కాలంలో పూర్తి జీతం, అలవెన్స్ ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. ప్రభుత్వం అమలు చేయడం లేదని ఏబీవీ కోర్టు దిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారించగా.. కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని ఇప్పటికే రెండు పర్యాయాలు సీఎస్ కు లేఖలు రాసినట్లు ఏబీవీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 22 నుండి మాత్రమే పూర్తి వేతనం ఇచ్చారనీ, పాత బకాయిలు చెల్లించలేదని వివరించారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది.
గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావును భద్రతా పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై 2020 ఫిబ్రవరి 8న ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇదే అంశంపై ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. తన సస్పెన్షన్ అక్రమం అంటూ ఆయన హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చివరకు సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఈ ఏడాది మే 18న ఆయనను విధుల్లోకి తీసుకుంది. జూన్ 14న ఆయనను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టిన 15 రోజుల్లోనే.. ఆయనపై నమోదైన ఏసీబీ కేసులో సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నించారన్న అభియోగంపై మరో సారి సస్పెండ్ చేసింది ప్రభుత్వం.
సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?