ఏపీ బీజేపీ నాయకత్వంపై రీసెంట్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల దుమారం చల్లారకముందే బీజేపీలో మరో సంచలనం చోటుచేసుకుంది. బీజేపీ, జనసేన పొత్తు అని చెబుతున్నా ఆ పార్టీ నేతల మధ్య సమన్వయం లోపించింది. సంఘటిత కార్యక్రమాలు నిర్వహించలేదు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం జనసేనతో కలవడం లేదన్నట్లుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. బీజేపీ కలిసి ప్రయాణించే పరిస్థితులు లేనట్లుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఏపిలో తాజా రాజకీయ పరిణామాలు వివరించేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీకి వెళ్లారు. ఈ తరుణంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు పార్టీలో మళ్లీ దుమారాన్ని రేపుతున్నాయి.
పార్టీని నడిపేవిషయంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. తమతో పొత్తులో ఉన్న జనసేనతో సమన్వయం చేసుకోవడంలోనూ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని అన్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొన్నారు కన్నా లక్ష్మీనారాయణ. పార్టీ రాష్ట్ర శాఖలో అసలు ఏమి జరుగుతుందో కూడా తెలియడం లేదని అన్నారు. గతంలో తాను అధ్యక్షుడుగా ఉన్న సమయంలో ప్రతి రెండు నెలలకు ఒక సారి కోర్ కమిటీ భేటీ ఏర్పాటు చేసుకుని ఆయా సమస్యలు, అంశాలపై చర్చించుకునే వారమని గుర్తు చేశారు. అయితే సోము వీర్రాజు ఒక్కరే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని, అసలు కోర్ కమిటీ సమావేశాలే జరగడం లేదని అన్నారు. ఇందు వల్ల రాష్ట్ర శాఖలో ఏమి జరుగుతుందో పార్టీ నేతలకే తెలియడం లేదని కన్నా వ్యాఖ్యానించారు. పొత్తు నుండి జనసేన తప్పుకుంటే అందుకు సోము వీర్రాజే బాధ్యులు అవుతారు అన్నట్లుగా మాట్లాడారు.
గతంలోనూ సోము వ్యవహారాల తీరుపై కొందరు పార్టీ అధిష్టానంకు ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తరుణంలోనే ఏక పక్ష నిర్ణయాలకు ఆస్కారం లేకుండా పార్టీ అధిష్టానం పలువురు నేతలతో కోర్ కమిటీని ఏర్పాటు చేసింది. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు ఇచ్చే విషయంలో సోము వీర్రాజు తొలుత సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆ పార్టీ నాయకులు దూరంగా ఉన్నారు. రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో అమిత్ షా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో గతంలో జరిగిన అమరావతి రైతుల పాదయాత్రలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇప్పుడు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా బహిరంగంగా కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేయడంతో పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
YSRCP: ఎన్నికలు రేపు అన్నట్లుగా క్యాడర్ పని చేయాలని ఉద్భోదించిన వైసీపీ నేత, సీఎం వైఎస్ జగన్