తెలంగాణ మాజీ సీఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ గురువారం ఏపి ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. ఏపీ సీఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి జాయనింగ్ కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ తో సోమేశ్ కుమార్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సోమేష్ కుమార్ కు వ్యతిరేకంగా ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్ ను ఏపి కేడర్ కు కేటాయించినందున అక్కడే విధులు నిర్వహించాలని హైకోర్టు పేర్కొంటూ క్యాట్ ఉత్తర్వులను కొట్టేసింది. హైకోర్టు తీర్పు వెలువడిన రోజే కేంద్ర ప్రభుత్వం సోమేష్ కుమార్ ను తెలంగాణ నుండి రిలీవ్ చేస్తూ ఈ నెల 12న (నేడు) ఏపిలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) హోదాలో పని చేసిన సోమేష్ కుమార్.. ఏపిలో ఆ పోస్టులో నియమించే అవకాశం లేనందున విఆర్ఎస్ తీసుకునే ఆలోచనలో ఉన్నారనీ, విఆర్ఎస్ తీసుకున్న వెంటనే కేసిఆర్ సర్కార్ ఆయనను ప్రభుత్వ సలహాదారుగా ఢిల్లీలో ప్రభుత్వ వ్యవహారాలు చూసేందుకు నియమించనున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. దీనిపై సోమేష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ నుండి విమానంలో ఈ ఉదయం గన్నవరం చేరుకున్న సోమేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపికి వచ్చానని, తనకు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తానని తెలిపారు. ఒక అధికారిగా డీవోపీటీ ఆదేశాలు పాటిస్తానని పేర్కొన్న ఆయన.. విఆర్ఎస్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఆ విషయాన్ని వెల్లడిస్తానని తెలిపారు. మరో వైపు సోమేష్ కుమార్ స్థానంలో తెలంగాణ సర్కార్ .. సీనియర్ ఐఏఎస్ అధికారి శాంతి కుమారిని నూతన సీఎస్ గా నియమించిన సంగతి తెలిసిందే.