తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం హైదరాబాద్ లో జరిగిన అరెస్టులు . హైదరాబాద్ హఫీజ్పేట్ భూముల వ్యవహారం తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. ఆ భూ వివాదానికి లింక్గా బోయిన్పల్లిలో జరిగిన కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు.
భూమా అఖిలప్రియ విడుదల కోసం సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలైంది. అయితే, ఆమెకు బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసులు.. కౌంటరు దాఖలు చేశారు . దీంతో కస్టడీ పిటిషన్తో పాటు బెయిల్ పిటిషన్లపై విచారణను సోమవారానికి సికింద్రాబాద్ కోర్టు వాయిదా వేసింది . ఇదే సమయంలో ఓ సంచలన చర్చ జరుగుతోంది.
ప్రమాదంలో అఖిలప్రియ ?
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో తెలుగుదేశం పార్టీ నేత , మాజీ మంత్రి అఖిలప్రియ ఏ-1గా ఉన్న సంగతి తెలిసిందే. అరెస్ట్ అయిన ప్రస్తుతం చంచల్గూడలోని మహిళా జైలులో ఉన్నారు. అఖిలప్రియ ఆరోగ్యంపై సికింద్రాబాద్ కోర్టులో ఆమె తరపు న్యాయవాది మెమో దాఖలు చేశారు. అఖిలప్రియ జైళ్లో కింద పడిపోయారని.. ఆమె ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చిందని.. చికిత్స కోసం ఈఎన్టీ సర్జన్ వద్దకు తరలించాలని న్యాయవాది మెమోలో పేర్కొన్నారు . అఖిలప్రియ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేసే విధంగా జైలు అధికారులను ఆదేశించాల్సిందిగా కోర్టుకు విన్నవించారు. భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసులు.. కౌంటరు దాఖలు చేశారు.
పోలీసుల సంచలనం
భూమా అఖిలప్రియపై తప్పుడు కేసులు పెట్టే ఉద్దేశం ఏ మాత్రం లేదని సాక్ష్యాలు సేకరించేందుకు దర్యాప్తు బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని కౌంటర్ లో పోలీసులు పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలాలు నమోదు చేయాల్సి ఉందన్న పోలీసులు అఖిలప్రియ బెయిల్ పై వస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అఖిలప్రియ చర్యల వల్ల స్థానిక ప్రజల్లో అభద్రతాభావం నెలకొందని, అఖిలప్రియకు ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావితం చేయగలిగే పలుకుబడి ఉందని పేర్కొన్నారు. ఆమె విడుదలైతే దర్యాప్తును, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని, మరిన్ని నేరాలకు పాల్పడవచ్చని పేర్కొన్నారు.
కేసీఆర్ ను ఇరికిస్తున్నారా?
భూమా మౌనిక హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, తమ అక్క అఖిలప్రియకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తన అక్క సరిగా భోజనం కూడా చేయడం లేదని, ఆమెకు ఆరోగ్యం కూడా బాగా లేదన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నా అక్కను వేధిస్తున్నారని.. జైల్లో ఆమెను ఉగ్రవాది కన్నా దారుణంగా చూస్తున్నారని, అఖిలప్రియకు వైద్యం అందించడం లేదని ఆరోపించారు… ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే.. అక్క బ్రతికొస్తుందో లేదో..? అనే అనుమానాలను వ్యక్తం చేసిన మౌనిక.. అక్కకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. తమకు ఎక్కడా రక్షణ లేదని.. ఆస్పత్రి నుంచి అఖిలప్రియను తీసుకెళ్లే విధానం అదేనా? అని మౌనిక ప్రశ్నించారు. కాగా, తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్షంలో ఉన్న భూమా కుటుంబంతో గత కొద్దికాలంగా అంటిముట్టనట్లుగా ఉన్న శ్రేణులు దగ్గరకు వస్తున్నారని , ఈ సమయంలో పోలీసుల నిర్ణయం భూమా కుటుంబానికి ఊహించని ఆఫర్ ఇచ్చిందని కొందరు విశ్లేషిస్తున్నారు.