Judgment : విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అనుమానం పెనుభూతంగా మారి భార్యను అతి దారుణంగా సజీవ దహనం చేసిన ఓ ప్రభుద్దుడికి న్యాయమూర్తి ఉరిశిక్ష విధించారు.
వివరాల్లోకి వెళితే .. కృష్ణాజిల్లా కోడూరు మండలం లింగాయపాలెంకు చెందిన ముక్కు మోహనరావుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె శైలజ, తన ఇద్దరు చెల్లిళ్లు పద్మజ, జ్యోతి, తమ్ముడు అరవింద్ కుమార్ తో కలిసి ఆయిదేళ్ల క్రితం లబ్బీపేటలోని ఫకీర్ గూడెం పిడికిటి రామకోటయ్య వీధిలోని ఒక ఇంట్లోకి అద్దెకు దిగారు. వీరు అందరూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి తల్లిదండ్రులు ప్రతి శనివారం, ఆదివారం పిల్లల వద్దకు వచ్చి వెళుతుండేవారు. పెద్ద కుమార్తె శైలజ బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసిన ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుండేది.
అనుమానమే పెనుభూతమై..
2018లో శైలజ (30)కు కృష్ణాజిల్లా జొన్నపాడుకు చెందిన బత్తుల నంబియార్ (35) అలియాస్ సుజిత్ తో వివాహం అయ్యింది. సుజిత్ ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడుగా పని చేస్తున్నాడు. పెళ్లి అయిన కొద్ది రోజులకే అతను ఉద్యోగాన్ని వదిలేసి విజయవాడలోని భార్య వద్దకు వచ్చేశాడు. ఆమె సంపాదనపైనే జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే భార్య శైలజపై సుజిత్ అనుమానం పెంచుకున్నాడు. అయితే శైలజకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడంతో భర్త అనుమానాలు ఏమి పట్టించుకోకుండా ఇద్దరు చెల్లిళలు, తమ్ముడికి వివాహాలు జరిపించింది. దీంతో సుజిత్ ఆమెపై అసూయ, మరో పక్క అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆమెను ఎలాగైనా హత్య చేయాలని పథకం రచించాడు.
2019 జూన్ 16వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న శైలజ ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అనంతరం ఎమి తెలియనట్లు అతను బయటకు వచ్చి గుమ్మంలోకి వచ్చి తన భార్య మంటల్లో కాలిపోతుందంటూ కేకలు వేశాడు. చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి మంటలను ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ కు కాల్ చేశారు. తొలుత ఆమె ఆత్మహత్యాయత్నంకు పాల్పడి ఉంటుందని అందరూ భావించారు. ఆమె తన భర్తే వంటిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే వాళ్లు పోలీసులకు ఫోన్ చేశారు. భర్య తనపై చెప్పిందన్న భయంతో సుజిత్ తన ఒంటిపై కూడా పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. అప్పటికి అక్కడే యువకులు ఆ మంటలను ఆర్పేసి సుజిత్ ను పట్టుకున్నారు. పోలీసులు రాగానే వారికి సుజిత్ ను అప్పగించారు.
తీవ్రంగా గాయపడిన శైలజను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. సుజిత్కు స్వల్పగాయాలు కావడంతో ప్రధమ చికిత్స అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో నిందితుడిపై నేరం నిరూపణ అవ్వడంతో నిందితుడు సుజిత్ కు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఉరిశిక్ష విధించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?