Sharmila : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్దమైన విషయం తెలిసిందే. నిన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల సమావేశమైయ్యారు. వైఎస్ఆర్ అభిమానుల సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఇకపై వారానికి ఒకటి రెండు జిల్లాలో సమావేశాలను నిర్వహించాలని షర్మిల భావిస్తున్నారు. షర్మిల రాజకీయ పరంగా ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుని వెల్లడించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఓ పక్క ఏపిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నా అందరూ షర్మిల ఏమి చెప్పబోతున్నది అనే దానిపై ఆసక్తికనబర్చారు. దాదాపు మీడియా అంతా షర్మిల కొత్త పార్టీ సన్నాహక ఫొగ్రామ్ పైనే ఫోకస్ పెట్టింది. కొన్ని ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ చేశాయి.
అయితే తమ కుటుంబానికే చెందిన (సోదరుడు ఏపి సీఎం జగన్ సతీమణి భారతి ఆధీనంలోని) సాక్షి ఛానల్ మాత్రం షర్మిల ఫ్రొగ్రామ్ కు కవరేజ్ ఇవ్వలేదు. గతంలో షర్మిల జగన్ కోసం, వైసీపీ కోసం పాదయాత్ర చేసినప్పుడు, ఎన్నికల ప్రచారాలు జరిపినప్పుడు బ్రహ్మరథం పట్టిన సాక్షి మీడియా ఇప్పుడు కొద్ది సేపు కూడా కార్యక్రమాన్ని చూపకపోవడంపై షర్మిల మనసు నొచ్చుకుందని అంటున్నారు. ఎలాగూ రాజకీయ పార్టీకి రంగం సిద్ధం చేసుకుంటున్నందున సొంత మీడియా కూడా ఉండాలని భావిస్తున్నారుట షర్మిల.
ఓ కొత్త ఛానల్ తీసుకువస్తే ఒక పక్క తాను ప్రారంభించబోయే రాజకీయ పార్టీకి, తన భర్త ప్రముఖ సువార్త ప్రసంగీకుడు బ్రదర్ అనిల్ కుమార్ కార్యక్రమాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆలోచన చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. షర్మిల తీసుకురానున్న ఛానల్ వెనుక టీవీ 9 మాజీ సీఈఓ ఒకరు కీలక పాత్ర పోషిస్తున్నారని టాక్. రాజకీయ పార్టీల నేతలు తమ వాణిని ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లాలంటే మీడియానే ఏకైక సాధానం. ప్రస్తుతం షర్మిల ప్రత్యేకంగా తమ పార్టీ కోసం న్యూస్ ఛానల్ తీసుకురానున్నారని ప్రచారం జరుగుతున్నా అది ఎంత వరకు నిజమో మరి కొద్ది రోజుల్లో తేలనున్నది.