Corona దేశమంతా ఇప్పుడు కరోనా మహమ్మారి నుంచి విముక్తి అయ్యేందుకు వ్యాక్సిన్ పై భరోసా పెట్టుకుంటే … కన్నబిడ్డల్ని చంపేసిన ఓ తల్లి మాత్రం షాకింగ్ కామెంట్లు చేసింది.
చిత్తూరు జిల్లా మదనపల్లిలో సొంత కూతుళ్లను హత్య కేసులో తల్లిదండ్రులు పురుషోత్తం, పద్మజను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి విచారణ సందర్భంగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ భార్యభర్తల గురించే కాకుండా వారి ఫ్యామిలీ గురించి షాకింగ్ నిజాలు తెలిశాయి.
సొంత కూతుళ్లనే దారుణంగా చంపి…
సొంత కూతుళ్లను దారుణంగా చంపిన పురుషోత్తంనాయుడును ఏ1గా, పద్మజను ఏ2గా పోలీసులు మంగళవారం మధ్యాహ్నం పోలీసులు ప్రశ్నించారు. దెయ్యం పట్టిన తమ కూతుళ్లను డంబెల్స్తో కొట్టి చంపామని..వాళ్లు మళ్లీ బతుకుతారని నిందితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. పూజ గదిలోకి బూట్లతో వెళ్ల వద్దంటూ వాదనకు దిగింది. అరెస్ట్ చేసిన సమయంలో పద్మజ ప్రవర్తన షాకింగ్ గా ఉంది. రేపటిలోగా తన బిడ్డలు బతికి వస్తారని తనకు ఈ ఒక్క రోజు అవకాశం ఇవ్వాలని ఆమె కోరింది. చేతుల్ని తిప్పుతూ డ్యాన్స్ చేస్తూ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. అంతే కాదు ఇంట్లో పోలీసులతో ఆమె గొడవపడింది. ఈ రోజు అవకాశం ఇవ్వండి అంటూ వేడుకుంది. రేపటిలోగా ఇద్దరు బిడ్డలు బ్రతికి వస్తారంటూ పిచ్చి, పిచ్చిగా మాట్లాడింది. కరోనా టెస్టుకు పద్మజ సహకరించలేదు. కరోనా చైనా నుంచి రాలేదని, శివుడి శరీరం నుంచి వచ్చిందంటూ.. ‘నేనే శివుడిని.. నాకు టెస్టు ఏంటి.. నా గొంతులో హాలాహలం ఉంది’ అంటూ విచిత్రంగా ప్రవర్తించింది. చెత్తను కడిగేయడానికి తన శరీరం నుంచి కరోనాను పంపించానంది. దీంతో పోలీసు వాహనం వద్దే పద్మజకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. కూతుళ్లను దారుణంగా హత్య చేశామనే పశ్చాత్తాపం కూడా కనిపించలేదు. పురుషోత్తం నాయుడులో కాస్త బాధ కనిపించినా ఆమె మాత్రం దర్జాగా పోలీసుల వాహనంలోకి వెళ్లి కూర్చుంది.
corona : వైద్యులు ఏమంటున్నారో తెలుసా?
కాగా , సొంత కూతుళ్లను అత్యంత కిరాతకంగా చంపిన పురుషోత్తం నాయుడు, పద్మజలకు ప్రభుత్వ మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ రాధిక వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మజ తండ్రి మానసిక వ్యాధితో బాధపడుతూ ఇటీవలే చనిపోయారని వెల్లడించారు. పద్మజ మేనత్త కూడా మానసిక సమస్యతో ప్రస్తుతం బాధపడుతోందని గుర్తించామని అన్నారు. పద్మజ కూడా తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. మానసిక శాస్త్రంలో డెల్యూషన్స్ అనబడే ఈ వ్యాధిగ్రస్తులు తాము నమ్మిన విషయాన్ని బలంగా విశ్వసిస్తారు. అదే నిజమని భావిస్తూ ఉంటారని అన్నారు. పద్మజ కొన్ని నెలలుగా ఈ వ్యాధితో బాధపడుతోందని తనకున్న మానసిక సమస్యని భర్త, కూతుళ్లకు కూడా ఆమె అంటించిందని ఆమె పేర్కొన్నారు. దీన్నే వైద్య పరిభాషలో ‘షేర్ డెల్యూషన్స్’ అంటారని ఆమె తేల్చి చెప్పారు. పిల్లల తండ్రి పురుషోత్తం నాయుడు కూడా ఇదే మానసిక సమస్యతో ప్రస్తుతం బాధపడుతున్నారని పేర్కొన్నారు.