తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాత్ర కీలకం. ఆ మాటకొస్తే దేశ రాజకీయాల్లో కూడా చంద్రబాబు సీనియర్ . అందరికంటే కూడా తాను సీనియర్ అని ప్రకటించుకుంటుంటారు.
అయితే, తాజాగా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరి షాక్ కు గురిచేస్తోందని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోందట. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో ఈ టాక్ తెరమీదకు వస్తోంది.
ఢిల్లీలో హాట్ రాజకీయం
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అంశం కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు. వ్యవసాయ సంస్కరణలను సవాలు చేస్తూ ఇప్పటికే ఆందోళనలు చేస్తున్న రైతులు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ ఎస్ఐ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలింది… కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో పూర్తి తీర్పు వచ్చే వరకు చట్టాలపై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇక, ఇదే సమయంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిపుణులతో కమిటీ ఏర్పాటు కానుండగా.. చట్టాలపై అనుకూల, ప్రతికూల వాదనలు విననున్న కమిటీ.. ఆ వాదనల తర్వాత సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వనుంది.
బాబు జాడ ఏది?
వాస్తవానికి ఈ తీర్పు సంచలనం. దేశంలోని విపక్షలాన్నీ ఈ తీర్పుపై సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తిరుగుబాబు జెండా ఎగురవేసిన…. కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలన్నింటినీ కూడగట్టిన చంద్రబాబు మాత్రం సైలెంట్ అయిపోయారు. కారణం ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోడీని కెలకకూడదని నిర్ణయించుకోవడమని పలువురు అంటున్నారు. కొద్దికాలం క్రితం ఈ చట్టాలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని సైతం చంద్రబాబు టార్గెట్ చేశారు. ఇప్పుడు సీఎం ను సైతం ఈ చట్టాలపై చంద్రబాబు విమర్శించడం లేదు. ఎందుకంటే.. జగన్ పై విమర్శలు గుప్పించినా… అవి ప్రధాని మోడీని టార్గెట్ చేస్తాయనే ఆలోచన అంటూ పలువురు విశ్లేషిస్తున్నారు.