nimmagadda ramesh : ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత కొద్దికాలంగా రాష్ట్ర వార్తాల్లో ప్రధాన అంశంగా నిలుస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో పొలిటిక్ హీట్ పెంచుతుండటమే కాకుండా ఎత్తులు పై ఎత్తులకు కేంద్రంగా మారుతుండటమే ఇందుకు కారణం.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను టార్గెట్ చేస్తుండగా తన విధి నిర్వహణకు రాజకీయ రంగు పులమవద్దని నిమ్మగడ్డ కోరుతున్నారు. అయితే ఆయన్ను రాజకీయంగానే టార్గెట్ చేసేందుకు అధికార పార్టీకి మరో అస్త్రం దొరికిందని ప్రచారం జరుగుతోంది.
మంట పుట్టించిన చంద్రబాబు…
పంచాయతీ ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా పలు హామీలు గుప్పించారు. అయితే, టీడీపీ పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోపై అధికార పార్టీ భగ్గుమంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయని, అంతే కాకుండా పార్టీ గుర్తు ఉండని ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయటం రాజ్యాంగ విరుద్ధం అని వైసీపీ నేతలు ప్రకటించారు. ఇదే అంశాన్ని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ దృష్టికి తీసుకెళ్తామని.. టీడీపీపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తామని వైసీపీ నేతలు పేర్కొన్నారు.
nimmagadda ramesh : నిమ్మగడ్డకు తలపోటు ఖాయమేనా?
పంచాయతీ ఎన్నికల విషయంలో ఇప్పటికే అధికార, ప్రతిపక్షాల మధ్య ఫిర్యాదుల పర్వం నడుస్తోంది. అదే సమయంలో నిమ్మగడ్డ రమేష్ను సైతం రాజకీయ విమర్శలు చుట్టుముట్టాయి. మరోవైపు ఇప్పటికే ఏకగ్రీవాల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. నేటి నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా… రాయలసీమ పర్యటనకు సిద్ధం అయ్యారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఏకగ్రీవాలపై పలు ఫిర్యాదులు అందడంతో.. నిమ్మగడ్డ రాయలసీమ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విషయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల కమిషన్ ఆఫీస్ మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ కనుక తన వైఖరిని వెల్లడించకపోయినా… లేదా వైసీపీ ఊహించిన స్థాయిలో లేకపోయినా… ఆయన్ను టార్గెట్ చేయడం ఖాయమని అంటున్నారు.