తెలంగాణ ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్రంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.
కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇద్దరు కేసీఆర్ నిర్ణయాలపై మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు.
ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీతో టిఆర్ఎస్ గల్లీమే కుస్తీ.. ఢిల్లీమే దోస్తీ చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ లాంటి సిగ్గులేని సీఎంను తాను చూడలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్లలో రైతుల పంట కొనుగోలు ద్వారా నష్టం వచ్చిందని కేసీఆర్ అనడం సిగ్గుచేటు అని ఉత్తమ్కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రతీ గ్రామంలో, ప్రతి గింజ కొనాల్సిందే లేదంటే పోరాటమేనని ప్రకటించారు. సీఎం కేసీఆర్కు రోజులు దగ్గరపడ్డాయని మండిపడ్డ ఉత్తమ్కుమార్రెడ్డి ఆయన.. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. బీజేపీ, టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేయడం వల్లే మొన్నదుబ్బాకలో ఓటమి పాలయ్యామని వ్యాఖ్యానించారు.
అక్రమ సంపాదన కాపాడుకునేందుకు….
ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం సీఎం కేసీఆర్ ఆలోచనలో మార్పు వచ్చిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. అక్రమ సంపాదన కాపాడుకోవడానికి మోడీకి రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెడుతున్నాడని జీవన్రెడ్డి ఫైర్ అయ్యారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ ఈ రెండు కూడా ప్రజలచే, పన్నుల రూపేణా వచ్చిన సొమ్ముతో అమలు చేయబడుతున్నాయని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ వినియోగించుకోవడం ప్రజలందరి హక్కు అని స్పష్టం చేశారు. ప్రభుత్వం చెప్పిన ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పడుతున్న భారం ఎకరానికి రూ.500 లు మాత్రమేనని… తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో రైతుల భాగస్వామ్యం లేదా అని ప్రశ్నించారు.