నువ్వు ఖూనీకోరువు…. నీపై హత్యా నేరాలు ఉన్నాయి …. సత్య ప్రమాణాలు చేద్దామా ? నా స్థాయి ఏంటి? నీ అంతస్తు ఏంటి ? ఇలా సవాళ్లు, ప్రతి సవాళ్లు ఆ ఇద్దరు నేతల మధ్య నడిచాయి. వాళ్లు ఆషామాషీ నాయకులు కూడా కాదు ఏకంగా ఎమ్మెల్యేలు.
అంతేకాకుండా షిరిడి సాయిబాబా గుడిలో ప్రమాణం కోసం ఎమ్మెల్యే భారీ ర్యాలీగా చేరుకోవడం… అక్కడ నుంచి గంట గంటకు ఉత్కంఠ అంత కథ నడిచి ఆఖరికి ఏం జరిగిందయ్యా అంటే … ఇద్దరు ఎమ్మెల్యేలు పెళ్లికొడుక్కి అటు ఇటూ నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు. చిరునవ్వులు చిందించారు. దీన్ని చూసిన వారంతా ఏపీ జనాలు ఎర్రి ఎంగలప్పలు అయ్యారు అంటూ కామెంట్ చేస్తున్నారు.
విశాఖపట్టణం లో రచ్చ రచ్చ
విశాఖ తూర్పు నియోజకవర్గం వేదికగా పొలిటికల్ హైడ్రామా నడిచింది గుర్తుండే ఉంటుంది. విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు బినామీ ఆస్తుల వ్యవహారం ఇది అంటూ వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే బినామీ ఆస్తుల చిట్టా ఇదిగో అని వైసీపీ బయట పెట్టింది. దీనికి వెలగపూడి రియాక్షన్ వాతావరణాన్ని హీటెక్కించింది. వెలగపూడి రామకృష్ణ పై జరిగిన ఈ విమర్శల పర్వం రెండురోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది.
కట్ చేస్తే …. కలిసి కట్టుగా
వెలగపూడి రామకృష్ణ, గుడివాడ అమర్నాథ్ మధ్య సాగిన మాటల యుద్ధం రాష్ట్రంలో ఓ రేంజ్లో హీట్ పుట్టించగా అదే రోజు సాయంత్రం సీన్ మారిపోయింది. టీడీపీ నాయకుడు నాగార్జున పెళ్లి మండపంలో ఈ ఇద్దరు ప్రత్యక్షమయ్యారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పెళ్లికొడుక్కి అటు ఇటూ నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు. చిరునవ్వులు చిందించారు. ఈ ఫోటోలు బయటకు రావడంతో పొలిటికల్ సర్కిల్స్లో వైరల్ అయ్యాయి. రోజంతా వాతావరణాన్ని వేడెక్కించిన వాళ్లు సాయంత్రానికి ఇంత కూల్గా మారిపోవడం చూస్తుంటే…. ఇదే రాజకీయం అని కొందరు అంటుంటే ఏపీ జనాలను ఎర్రి ఎంగలప్పలు చేశారు కదా అంటూ ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు.