KTR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన తనయుడు, మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయనున్నారనే ప్రచారం గత కొద్దిరోజులుగా జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో తెలంగాణ లోని కీలక వర్గాలు మండిపోయే నిర్ణయం తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్నారని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అందించే పీఆర్సీ విషయంలో వారికి షాకిచ్చే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం లీక్ అయింది. దీనిపై భగ్గుమంటున్నాయి ఉద్యోగ సంఘాలు.
ఉద్యోగుల కు మండిపోయింది
తెలంగాణ ఉద్యోగులకు అందించే పీఆర్సీ కి సంబంధించిన నివేదిక అధికారికంగా వెలుగులోకి రాకముందే లీక్ అయింది. పీఆర్సీ నివేదిక సిఫార్సులపై అటు ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్ దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ ముందు పీఆర్సీ కాపీలను దగ్ధం చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది. లిబర్టీ ముందు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆందోళనకు దిగాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేయడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులకు, ఉద్యోగసంఘాల మధ్య వాగ్వివాదం జరిగింది. ప్రస్తుతం లిబర్టీ సెంటర్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
KTR : కేసీఆర్ ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారు?
రవీంద్రభారతిలో తెలంగాణ గ్రూప్-1ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ-2021, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదటి పీఆర్సీ అడిగినదానికంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కువ ఇచ్చారని గుర్తు చేశారు. అందరికీ పదోన్నతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ నెల 31వ తేదీలోపు పదోన్నతులు పూర్తి చేసేలా కృషి చేస్తున్నామని ఆయన ప్రకటించారు. కరోనా వల్ల పీఆర్సీ కొంత ఆలస్యమైంది.. ప్రభుత్వాన్ని అర్ధం చేసుకోవాలని కోరారు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క అధికారికి అన్యాయం జరిగినా అండగా నిలుస్తున్నామన్న ఆయన.. పీఆర్సీ ఇచ్చిన నివేదికను చూసి ఆందోళన చెందొద్దు.. సీఎం కేసీఆర్ ఉద్యోగులకు సరైన న్యాయం చేస్తారని తెలిపారు. మొత్తంగా ఓ వైపు తనయుడిని సీఎం చేయాలని భావిస్తున్న కేసీఆర్ ఈ సమయంలో ఇలా ఉద్యోగులతో ఎందుకు రచ్చ చేసుకుంటున్నారనే టాక్ తెరమీదకు వస్తోంది.