తెలంగాణ లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న హాట్ హాట్ ప్రచారం … ముఖ్యమంత్రి కేసీఆర్ తన సీటును కుమారుడికి అప్పగించనున్నారనేది.
కొడుకు ను సీఎం చేయడం కోసమే కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేటీఆర్ను సీఎం చేయడానికి దోష నివారణ కోసమే సీఎం కాళేశ్వరం వెళ్లారని, తాము చెప్పింది వాస్తవం కాబట్టే కేసీఆర్ ఖండించడం లేదని ఆయన చెప్తున్నారంటే…. కేటీఆర్ సీఎం పీఠం పై చర్చ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
కేటీఆర్ సీఎం … టీఆర్ఎస్ నేతల ఫీలింగ్ ఏంటి?
అసలు కేటీఆర్ సీఎం అనే ప్రచారం మొదలయిందే… టీఆర్ఎస్ నేతల నుంచి కావడం గమనార్హం . కేటీఆర్ త్వరలోనే సీఎం అవుతారని మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసబెట్టి కోరస్ పాడుతున్నారు. కొందరు ఏకంగా అడ్వాన్స్ గ్రీటింగ్స్ కూడా చెప్పేస్తున్నారు. కేటీఆర్ ను సీఎం చేయాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు , మంత్రులు గంగుల కమాలకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు , ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు ఎప్పుడు చేపడతారనే ఊహాగానాలతోపాటు ఆయన కేబినెట్లో మంత్రులుగా ఎవరుంటారు? ఈసారి కీలక బెర్త్లు ఎవరికి దక్కుతాయి? అనే చర్చ అధికార పార్టీలో జోరుగా సాగుతోంది. అయితే , ఇక్కడే ఇంకో చర్చ జరుగుతోంది.
వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్ ?
సికింద్రాబాద్ లో రైల్వే ఉద్యోగుల ప్రోగ్రాంకు అటెండ్ అయిన పద్మారావు ‘పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, బహుశా కాబోయో సీఎం.. కేటీఆర్ కు శుభాకాంక్షలు’ అంటూ అభినందనలు చెప్పినప్పుడు కేటీఆర్ చిరు నవ్వులు చిందించారు. అయితే , అనంతరం ప్రోగ్రాం పూర్తయ్యాక కారు ఎక్కుతూ.. ‘‘చిచ్చా ..ఎందుకు మాట్లాడినవు. మాట్లాడినోళ్లకు ఫోన్ చేసి, అట్ల మాట్లాడొద్దని చెప్పిన’’ అని పద్మారావుతో కేటీఆర్ అన్నట్టు తెలిసింది. కేటీఆర్ ను సీఎం చేయాలని మాట్లాడిన మంత్రులు గంగుల కమాలకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ సీఎం పద్మారావు తో కేటీఆర్ మాట్లాడినట్టు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆలాంటి ప్రకటనలు వద్దని సూచించినట్టు తెలిసింది.