ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన సోమవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎన్ఐపీబీ) సమావేశం జరిగింది. కడప జిల్లాలో రూ.8,800 కోట్లతో జేఎన్ డబ్ల్యు ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ ప్రతిపాదనకు ఎన్ఐసీబీ ఆమోదం తెలిపింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేయనున్న పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులకు ఎన్ఈపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తంగా రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఎన్ఐపీబీ ఆమోదం తెలిపింది.
కడప జిల్లాలో సున్నపురాళ్లపల్లిలో జేఎన్ డబ్యు స్టీల్ రెండు విడతలుగా రూ.8,800 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. మొదటి విడతలో రూ.3,300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. మొదటి దశలో ఏడాదికి ఒక మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులు, రెండో దశలో ఏడాదికి 2 మిలియన్ టన్నుల స్టీలు ఉత్పత్తులు, మొత్తంగా ఏడాదికి మూడు మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులు చేయనుంది. వీలైనంత త్వరగా ప్లాంట్ పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. వెనుకబడిన రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చే ప్రక్రియలో ఇదొక గొప్ప ప్రయత్నమని అన్నారు సీఎం జగన్. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా అనేక అనుబంధ పరిశ్రమలు వస్తాయనీ, తద్వాారా రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు.
రూ.6,300 కోట్ల పెట్టుబడితో ఆదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వల్ల ప్రత్యక్షంగా 4వేల మందికి ఉపాధి లభించనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోట లో వేయి మెగావాట్లు, అనకాపల్లి , విజయనగరం జిల్లాల పరిధిలో రైవాడ వద్ద 600 మెగావాట్ల ప్రాజెక్టు ను డిసెంబర్ 2024 లో ప్రారంభించి నాలుగేళ్లలో పూర్తి చేయాలన్న లక్ష్యంగా తెలిపారు. రూ.8,855 కోట్లతో ఎర్రవరం, సోమశిల వద్ద రెండు హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులు వచ్చే ఏడాది జులైలో ప్రారంభమై విడతల వారిగా అయిదేళ్లలో డిసెంబర్ 2028 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ప్రాజెక్టులతో ప్రత్యక్షంగా 2100 మంది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.