బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిరపడిన ఓ యువకుడు విడుదల చేసిన ఓ బహిరంగ లేఖ నెల్లూరు జిల్లాలోని ఓ సీనియర్ వైసీపీ ఎమ్మెల్యే కుటుంబంలో కలకలాన్ని రేపింది. ఇప్పటి వరకూ ఆయనకు ఇద్దరు బార్యలు అన్న విషయం నియోజకవర్గ ప్రజలకు, నేతలకు తెలుసు. కానీ ఇప్పుడు తాజాగా మరో సంబంధం వెలుగు చూసింది. విషయంలోకి వెళితే.. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిరపడిన మేకపాటి శివచరణ్ రెడ్డి.. తాను మేకపాటి చంద్రశేఖరరెడ్డి కుమారుడిని అంటూ బహిరంగ లేఖ విడుదల చేశారు. తనను కుమారుడుగా అంగీకరించాలని కోరారు. ఈ లేఖ ఇప్పుడు వైరల్ గా అయ్యింది. 18 ఎళ్లు రహస్యంగా ఉంచి మమ్మల్ని విడిచిపెట్టారంటూ మేకపాటి శివచరణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి.
తమ మధ్య ఉన్న సంబంధం వెల్లడించాలని తాను అనుకోలేదనీ, కానీ రీసెంట్ గా తనకు కుమారుడు లేరనీ, మొదటి భార్యకు ఒక కుమార్తె, రెండో భార్యకు ఒక కుమార్తె ఉన్నారంటూ చంద్రశేఖర్ రెడ్డి ఓ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించడంతో తాను ఈ లేఖ రాయాల్సి వచ్చిందన్నారు. శివచరణ్ రెడ్డి తన లేఖతో పాటు చిన్న నాటి ఫోటోలను కొన్ని విడుదల చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లేఖలో ఏమని రాశారంటే..
‘నా జీవితంలో అన్ని ముఖ్యమైన సంఘటనల్లో మిమ్మల్ని మిస్ అయ్యాను, నాకు జన్మనివ్వమని నేను మిమ్మల్ని అడగలేదు. నేను మీ బాధ్యత. 14 ఏళ్ల వయసులో మీరు మమ్మల్ని విడిచిపెట్టిన తర్వాత నేను మీ హృదయంలో నా స్థానాన్ని అర్ధం చేసుకున్నాను. నేను మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. నా చదువుకు ఫీజులు చెల్లించినందుకు ధన్యవాదములు. తండ్రి బాధ్యత అక్కడితో ముగియదు. మీరు నా తల్లి గారితో 18 ఎళ్లు కలిసి జీవించి విడిచిపెట్టారు. మీరు మమ్మల్ని ఎప్పుడూ రహస్యంగా ఉంచారు. మీ సంపద లేదా రాజకీయ వారసత్వం వెనక నేను లేను. దయచేసి నన్ను మీ కుమారుడుగా గుర్తించండి. ఇది మీరు పూర్తిగా చెయగలిగింది. ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చానంటే ఒక ఇంటర్వ్యూలో మీకు మగ పిల్లలు లేరన్నారు. మరి నేను ఎవర్ని. నేను మీ కొడుకుని. నన్ను, నా బాధను గుర్తించండి’ అంటూ లేఖలో పేర్కొన్నారు శివచరణ్ రెడ్డి.
శివచరణ్ రెడ్డి లేఖ సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో ఉదయగిరి నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయ్యింది. సినిమా టిక్ స్టోరీగా ఉందంటూ నెటిజన్ లు కామెంట్స్ చేస్తున్నారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004,2009 లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రశేఖర్ రెడ్డి , 2012 ఉప ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. చంద్రశేఖర్ రెడ్డి రెండో భార్య శాంతి కుమారి (శాంతమ్మ) ప్రచార కార్యదర్శిగా ఉన్నారు. శాంతమ్మ తొమ్మిది నెలల క్రితమే చంద్రశేఖర్ రెడ్డి రెండో భార్యగా వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు తాను చంద్రశేఖరరెడ్డి కుమారుడిని అంటూ శివచరణ్ రెడ్డి వెలుగులోకి రావడం చర్చనీయాంశం అవుతోంది. దీనిపై ఇంత వరకూ మేకపాటి చంద్రశేఖరరెడ్డి స్పందించలేదు. ఈ వివాదానికి ఎలా ముగిస్తారు అనేది సర్వత్రా ఆసక్తి గా మారింది.