అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్ లో నిన్న ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్ధులు గల్లంతైన సంగతి తెలిసిందే. జాలర్లు ఒక విద్యార్ధిని కాపాడి ఒడ్డుకు చేర్చగా. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా గల్లంతైన విద్యార్ధుల మృతదేహాలు అన్ని లభ్యమైయ్యాయి. గల్లంతైన వారిలో ఈ రోజు అయిదుగురు. నిన్న ఒకరి మృతదేహం లభ్యమైంది. విద్యార్ధుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి లోని ఆసుపత్రికి తరలించారు.
అనకాపల్లి దాడి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 15 మంది విద్యార్ధులు శుక్రవారం సాయంత్రం సముద్ర తీరానికి వెళ్లారు. కంపర జగదీశ్ (గోపాలపట్నం), బయ్యపునేని సతీష్ కుమార్ (గుంటూరు), జశ్వంత్ కుమార్ (రోలుగుంట, అనకాపల్లి), సూరిశెట్టి తేజ ( మునగపాడు), పెంటకోట గణేష్ (చుచుకొంట), పూడి రామచందు (యలమంచిలి), గుడివాడ పవన్ సూర్యకుమార్ (పెద్దబొడ్డేపల్లి) లు మరో 8 మంది స్నేహితులు సముద్ర తీరానికి చేరుకుని కొద్దిసేపు సరదాగా గడిపారు.
వీరిలో ఏడుగురు సముద్రంలో స్నానానికి దిగగా రాకాసి అల వీరిని లోపలకు లాక్కుపోయింది. ఒడ్డున ఉన్న విద్యార్ధులు రక్షించాలి రక్షించాలి అంటూ కేకలు వేయడంతో అక్కడ ఉన్న మత్స్యకారులు సూరిశెట్టి తేజ అనే విద్యార్ధిని కొన ఊపిరితో ఉండగా కాపాడారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గల్లంతైన వారిలో గుడివాడ పవన్ సూర్యకుమార్ మృతదేహం తీరానికి కొట్టుకొచ్చింది. గల్లంతైన మిగిలిన విద్యార్ధుల ఆచూకి కోసం నేవీ హెలికాఫ్టర్, నాలుగు బోట్లతో కోస్ట్ గార్డ్స్ , మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నీటిలో తేలియాడుతున్న మృతదేహాలను హెలికాఫ్టర్ ద్వారా ఒక్కుకు చేర్చారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు విద్యార్ధులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులు, బందువులు అనకాపల్లి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.