ప్రజల జీవనంలో ఇప్పుడు సెల్ ఫోన్ ఒక భాగమైపోయింది. సెల్ ఫోన్ల వినియోగం పెరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ సెల్ఫీ ఫోటోలు, వీడియోలు తీసుకోవడం, వాటిని స్టేటస్ లో అప్ లోడ్ చేసుకోవడం, స్నేహితులతో పంచుకోవడం సర్వసాధారణం అయిపోయాయి. అయితే సెల్ఫీ సరదాలు చాలా సందర్భాల్లో విషాదాన్ని కల్గిస్తున్నాయి. జంతు ప్రదర్శన శాలలో సెల్పీ దిగుతున్న సమయంలో వాటి బారిన పడటం, సరస్సు, నదుల వద్ద సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ప్రమాదాలకు గురి కావడం చూస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము. తాజాగా ఆమెరికాలో విహార యాత్రకు తెలుగు దంపతులు ఫోటోలు దిగుతూ ప్రమాదానికి గురై మృతి చెందారు. వారి విహార యాత్ర ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
విషయంలోకి వెళితే .. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన మద్దన నారాయణ, హరిత దంపతులు వారి పిల్లలతో కలిసి ఆమెరికాలో వీకెండ్ విహార యాత్రకు వెళ్లారు. అరిజోవా ప్రాంతంలో నివాసం ఉండే వీరు ఫినిక్స్ ప్రాంతంలో విహార యాత్రకు వెళ్లారు, వీరు సరస్సు దాటుతున్న సమయంలో ఐస్ లేక్ లో ఫోటోలు దిగుతుండగా ఒక్కసారిగా ఐస్ కూలిపోయింది. దీంతో నారాయణ, హరిత దంపతులు ఇద్దరూ కూరుకుపోయారు. హరితను రక్షించేందుకు సహయక బృందాలు ప్రయత్నించాయి కానీ అప్పటికే ఆమె మృతి చెందింది. నారాయణ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో వారి పిల్లలు ఒడ్డునే ఉండటంతో బతికిపోయారు. ఈ సంవత్సరం జూన్ మాసం లో కుటుంబంతో సహా నారాయణ స్వగ్రామానికి వచ్చారని బంధువులు చెబుతున్నారు. విహార యాత్రకు వెళ్లి నారాయణ దంపతులు మృతి చెందిన వార్త తెలియడంతో వారి స్వగ్రామంలో విషాదశ్చాయలు అలుముకున్నాయి.
ఇప్పటికైనా జరుగుతున్న ప్రమాదాలను గమనించి సెల్పీ ఫోటోలు, వీడియోలు తీసుకునే సమయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గమనించాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం, అజాగ్రత్త నిండు ప్రాణాలను బలి తీసుకుంటాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ.