Somu Veerraju: ‘ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎదగాలి.. ప్రజల్లో పార్టీపై నమ్మకం పెంచాలి.. ఓట్లు సాధించాలి..’ ఇదీ బీజేపీ అధిష్టానం కోరుకునేది. కానీ.. నేతల స్వయంకృతాపరాధం బీజేపీకి నష్టం చేస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు ఒకటే అనడంలో సందేహం లేదు. కానీ.. తరచూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. రీసెంట్ గా ‘కడప జిల్లాలో ఎయిర్ పోర్టు’ అనే అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయన దిద్దుబాటు చర్యలకు దిగి కడప జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కానీ.. ఆయన తీరుతో బీజేపీతో మిత్రపక్షంలో ఉన్న జనసేనకు కూడా నష్టం కలిగిస్తుందనే చెప్పాలి.
వివాదాస్పద వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అనే అంశాన్ని సీఎం జగన్ తెరమీదకు తెచ్చినప్పుడు.. సోము వీర్రాజు స్పందిస్తూ.. తాము అధికారంలోకి వస్తే జిల్లాకో రాజధాని ఏర్పాటు చేస్తామని అన్నారు. రీసెంట్ గా తాము అధికారంలోకి వస్తే మద్యం బాటిల్ 75కే ఇస్తాం.. ఆదాయం బాగుంటే 50కే ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు.. కడప జిల్లాలో ఎయిర్ పోర్ట్ అంశంపై మాట్లాడుతూ.. ‘హత్యలు చేసే జిల్లాలో ఎయిర్ పోర్టా..? వాళ్లకు హత్యలు చేయడమే తెలుస’ని చేసిన వ్యాఖ్యలు ఆయనకే కాదు.. అటు బీజేపీ, ఇటు జనసేనపై కూడా ఎఫెక్ట్ చూపేదే. ప్రస్తుతానికి ఈ వ్యాఖ్యలు బీజేపీకి, సోము వీర్రాజు వరకే పరిమితమైనా.. ఎన్నికల్లో కలిసి వెళ్తే మాత్రం పవన్ కల్యాణ్ కూడా వీర్రాజు వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
మిత్రపక్షం పరిస్థితి..
తనకు అధిష్టానం సహకరిస్తున్నంతగా.. స్థానికంగా సహకారం లేదని పవన్ ఆమధ్య చేసిన వ్యాఖ్యలతో మరునాడే పవన్ ఇంటికి సోము వీర్రాజు వెళ్లి మనస్పర్ధలకు చెక్ పెట్టారు. 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని.. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది. కానీ.. సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్యలు ఇరు పార్టీలను ఇరుకున పెడుతున్నాయనే చెప్పాలి. పార్టీ పరంగా నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వ్యక్తిగతమే అయినా.. పోత్తు ఉండటంతో రెండు పార్టీలపై ప్రజల్లో ఎంతోకొంత ఎఫెక్ట్ ఉంటుందని చెప్పాలి. దీనిపై పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ.. మిత్రబంధం ఉన్నప్పుడు జాగ్రత్తలు అవసరం.