Somu Veerraju: రాష్ట్రంలో వైసీపీ గుండా రాజ్యం కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం ఆయన ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా జరుగుమల్లి మండలం కే బిట్రగుంట బాధితులను పరామర్శించారు. కెబిట్రగుంట గ్రామంలో కుమ్మరి కులస్తులకు 1971 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ కే చంద్రయ్య జివో నెం.1076 ప్రకారం 6య90 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. దీంతో గ్రామంలోని ఆ కులస్తులు సౌసైటీగా ఏర్పడి షెడ్లు నిర్మించుకుని గత 50 సంవత్సరాలుగా వారి చేతివృత్తులను చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో ఆ కులస్థుడు బీజేపీ తరపున పోటీ చేయడంతో అధికార వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి తహశీల్దార్, ఎస్ఐ, సీఐల సహకారంతో జెసీబీలతో ఆ షెడ్లు అన్నింటినీ గత నెల 22వ తేదీ తెల్లవారుజామున కూల్చి వేసి స్థలాన్ని స్వాధీనం చేసుకని వారందరినీ వీధి పాలు చేశారు.
ఆదివారం బాధిత కుటుంబాలను పరామర్శించిన సోము వీర్రాజు వెనుకబడిన వర్గాలకు చెందిన కుమ్మరి కులస్థులపై వైసీపీ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో పోటీ చేసిన ఇతర పార్టీల అభ్యర్థులు, అవినీతిని ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం పెరిగిపోయిందన్నారు. కుమ్మరోడి నీకు రాజకీయాలెందుకని దూషించడాన్ని సోము వీర్రాజు తప్పుబట్టారు. రాష్ట్రంలో కుమ్మరి కులస్థులు రాజకీయాలలో పోటీ చేయడానికి అర్హులు కాదా అని సీఎం జగన్ ను ప్రశ్నించారు. ఈ విషయాన్ని జాతీయ బీసీ కమిషన్ దృష్టికి బీజేపీ తీసుకువెళుతుందనీ, బాధితులకు తిరిగి వారి స్థలంలో ఈ ప్రభుత్వం చేతనే షెడ్లను పునర్నిర్మింపజేసి సత్వర న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బాధితుల ఇళ్లను ధ్వంసం చేసిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.