Somu Veerraju : ఏపీ బీజేపీ ఛీఫ్ సోము వీర్రాజు ఇటీవల ఓ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అదే ఏపీ ముఖ్యమంత్రి పదవికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేరును బీజేపీ పరిశీలిస్తోందన్నది ఆ ప్రకటన సారాంశం. ఈ ప్రకటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సమయంలో ఈ ప్రకటన హాట్ టాపిక్ అయింది. అయితే, పవన్ కళ్యాణ్ ను కాకా పట్టేందుకే బీజేపీ ఈ ప్రకటన చేసిందని కొందరు అన్నారు. ప్రచారం సంగతి అలా ఉంచితే తాజాగా పవన్ గురించి కీలక అప్డేట్ తెరమీదకు వచ్చింది.
అంతా రెడీ అవుతున్నారు….
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ వ్యూహాలు పన్నుతున్నాయి. అధికార వైసీపీ ఈ స్థానంలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు మంత్రులను ఇంఛార్జ్లుగా నియమించడం మొదలుపెట్టింది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నేతలు కూడా తిరుపతిలో మకాం వేశారు. ఇక, కీలకమైన బీజేపీ, జనసేన పార్టీ నేతలు కూడా పని మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలోనే తిరుపతి ఉప ఎన్నిక విషయంలో కీలక అప్డేట్. అదే జనసేన అధినేత పవనల్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగుతున్నారు.
పవన్ ఎప్పుడు వస్తున్నారంటే….
జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తాజాగా పవన్ టూర్ గురించి వెల్లడించారు. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ విజయం కోసం ఏప్రిల్ 3న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరుపతిలో పాదయాత్ర నిర్వహిస్తారని ప్రకటించారు. ఎమ్మార్పల్లి కూడలి నుంచి శంకరంబాడి సర్కిల్ వరకూ పవన్ కల్యాణ్ పాదయాత్ర సాగుతుందని.. పాదయాత్ర తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు శంకరంబాడి సర్కిల్లో బహిరంగ సభలో పాల్గొంటారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ పాదయాత్రలో బీజేపీ-జనసేన ముఖ్య నేతలు పాల్గొంటారని తెలిపారు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న పవన్.. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారానికి సమయం ఇవ్వడంతో ప్రచారం మరింత హీటెక్కనుందని అంటున్నారు.