Sonia Gandhi : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోమారు భారతీయ రాజకీయాల్లో తాను ఎంత క్రియాశీలంగా వ్యవహరిస్తున్నది నిరూపించుకున్నారు. దేశమంతా తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంశంలో ఆమె కీలక అడుగు వేశారు.
గత కొద్దికాలంగా సామాన్యులకు షాక్ లు ఇస్తున్న పెట్రోల్ ధరలపై సోనియాగాంధీ తనదైన శైలిలో రియాక్టయ్యారు. ప్రజలను ఇబ్బందులపాలు చేసి కేంద్ర ప్రభుత్వం లాభపడుతోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విరుచుకుపడ్డారు. పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటాన్ని తప్పుబట్టారు. ఈ మేరకు నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
Sonia Gandhi మధ్య తరగతి మనసులు గెలిచావమ్మ…
మధ్య తరగతి, పేద వర్గాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సోనియాగాంధీ ఈ లేఖలో వివరించారు. దేశంలో ఎప్పుడూ లేని స్థాయికి చమురు ధరలు చేరాయని కాంగ్రెస్ అధినేత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా.. పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరగటాన్ని ఆమె తప్పుబట్టారు. కరోనా కారణంగా దిగిజారిన ఆర్థిక వ్యవస్థతో ఓవైపు ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని, కుటుంబ ఆదాయాలు, వేతనాలు తగ్గిపోతున్నాయని.. మధ్య తరగతి ప్రజలు, మన సమాజంలో అణగారిన వర్గాలవారు తీవ్ర ఇబ్బందులను అనుభవిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు .. ఈ సమస్యలకు తోడు ద్రవ్యోల్బణం, అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి.. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో ప్రజల కష్టాలు, ఇబ్బందుల నుంచి లాభాలు పిండుకోవాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు.
వంటగ్యాస్ ధరల గురించి సైతం …
వంట గ్యాస్ ధరలు పెరుగుతుండటంపై కూడా సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.800కు చేరిందని, ఇది చాలా క్రూరమైన విధానమని మండిపడ్డారు. పెట్రోలు, డీజిల్పై మితిమీరిన ఎక్సైజ్ సుంకాన్ని విధించడానికి సర్కార్ అమితోత్సాహం ప్రదర్శిస్తోందని సోనియాగాంధీ దుయ్యబట్టారు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా మోడీ పరిపాలన సాగుతోందని ఆక్షేపించారు. కాగా, ఇప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా దేశంలోని అన్ని వర్గాలు పెట్రోల్ , డీజిల్ ధరలపై భగ్గుమంటున్న సమయంలో సోనియాగాంధీ రాసిన లేఖ భారతీయుల హృదయాలను గెలుచుకునే విధంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు.