ఏపిలోని ప్రముఖ పుణ్య క్షేత్రం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైయ్యాయి. ఉత్సవాల్లో తొలి రోజు పాడ్యమి సోమవారం అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించారు. స్వర్ణ కవచంతో దుర్గాదేవి అష్టభుజాలతో, నక్షత్రాల కన్నా అధికమైన కాంతి కల్గిన ముక్కుపుడక ధరించి, బంగారు ఛాయ కల్గిన మోముతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సింహ వాహనాన్ని అధిష్టించిన దుర్గమ్మ శంకు చక్రం, గద, శూలం, పాశం, మహాఖడ్గం, పరిఘ అనే ఆయుధాలు ధరించి ఉన్నారు.తొలి రోజు అమ్మవారికి స్నపనాభేషకం చేశారు.
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిని దర్శించకుని తొలి పూజ చేశారు. అనంతరం ఉదయం 9 గంటల నుండి భక్తుల ధర్శనానికి అవకాశం కల్పించారు. ఉత్సవాల్లో తొలి రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు వేకువజాము 3 గంటల నుండే క్యూలైన్ లలో బారులు తీరారు. ఆలయం ఘాట్ రోడ్డు కింద ఉన్న ఆలయం వద్ద ఆలయ అర్చకులు దీక్షాధారులకు భవానీ మాలలు వేస్తున్నారు. జై దుర్గ, జైజై దుర్గ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. ఉత్సవాల్లో రెండవ రోజు రేపటి నుండి ఉదయం 4 గంటల మొదలు రాత్రి 11 గంటల వరకూ దర్శనానికి అనుమతిస్తారు. రోజు సాయంత్రం 6.30 గంటల నుండి 7.30 గంటల వరకూ అమ్మవారికి మహనివేదన , పంచహరతులు, చతుర్వేద స్వస్తి కార్యక్రమాలు ఉంటాయి. ఈ సమయంలో దర్శనాలను నిలిపివేస్తారు.
ప్రతి రోజు సాయంత్రం 6.30 గంటలకు మల్లేశ్వరస్వామి ఆలయం నుండి నగరోత్సవం ప్రారంభమవుతుంది. అక్టోబర్ 5 విజయదశమి రోజున మాత్రం సాయంత్రం నాలుగు గంటలకే నగరోత్సవం ఉంటుంది. అమ్మవారి ఆలయంలో దసరా పది రోజులు ప్రత్యేక పూజలు ఉంటాయి.రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కట్టు సత్యనారాయణ సూచనల మేరకు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా, దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ ఇఓ భ్రమరాంబ, పది శాఖల అధికారులు ప్రత్యక్షంగా ఉత్సవ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మరో పక్క కృష్ణానదిలో వరద ఉదృతిని దృష్టిలో ఉంచుకుని నదీ స్నానాలను పూర్తిగా నిషేదించారు అధికారులు. ఘాట్ ల వద్ద జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు.