గత విద్యా సంవత్సరంలో కరోనా మహమ్మారి మూలంగా రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాల తరగతులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. గత నెల నుండి తరగతులను పునః ప్రారంభించారు. పాఠశాల తరగతులకు రాని విద్యార్థులకు ఆన్ లైన్ క్లాస్ లను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ విద్యాసంవత్సరం పదవ తరగతి కామన్ పరీక్షలు, సిలబస్ తదితర అంశాలపై మీడియాలో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యా పరిశోధనా, శిక్షణ మండలి డైరెక్టర్ బి ప్రతాప్ రెడ్డి దీనిపై స్పందించారు. రాష్ట్రంలో పదవ తరగతి క్లాస్ ల నిర్వహణ, పరీక్షలపై ఒక క్లారిటీ ఇచ్చారు.
రాష్ట్రంలోని పాఠశాలల్లో ఏప్రిల్ 30 వరకూ తరగతులు కొనసాగుతాయని అన్నారు. మే నెలలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. పదవ తరగతి పరీక్షల్లో ఎన్ని పేపర్లు ఉంటాయనేది ఇంకా నిర్ణయం జరగలేదన్నారు. దీనిపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. దీనిపై మీడియాల జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు తదితరులతో మంగళవారం ఆయన యూట్యూబ్ అన్ లైన్ సమావేశం నిర్వహించారు.
సిలబస్ పూర్తికి హడావుడి పడవద్దు
9,10 తరగతుల విద్యార్థులకు జనవరి 6,7,8 తేదీల్లో, 7,8 తరగతులకు జనవరి 21,22,23 తేదీలలో ఫార్మేటివ్ -1 పరీక్షలు ఉంటాయని ఆయన చెప్పారు. అన్ని పాఠశాలల్లో ఏప్రిల్ 30వరకు క్లాస్ లు నిర్వహిస్తారనీ, సిలబస్ పూర్తి చేయడానికి ఉపాధ్యాయులు హడావుడి పడాల్సిన పనిలేదని పేర్కొన్నారు. పదవ తరగతి పరీక్షల్లో ఆప్షనల్ అంశాలు ఏమి ఉండవనీ, సిలబస్ తగ్గించినందున అన్ని అంశాలనూ కూలంకుషంగా విద్యార్థులకు బోధించాలని సూచించారు. తరగతుల్లో గైడ్లను అనుసరించి విద్యాబోధన చేయకూడదని అలా చేస్తే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పదవ తరగతి తరువాత ఏమి చేయాలన్న దానిపై విద్యార్థులు వారికి ఇష్టమైన రంగాలను ఎంచుకునేలా ముందుగానే కేరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని ఏస్సీఈఆర్టీ నిర్వహిస్తోందని ప్రతాప్ రెడ్డి తెలిపారు.