anandayya:ఆనందయ్య… నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వాసి. కరోనా మహమ్మారికి చెక్ పెట్టే మందు పంపిణీ చేసిన వ్యక్తిగా వార్తల్లో నిలిచారు. ఈ మందు ప్రజల దృష్టిని ఎంత ఆకర్షించిందో వార్తల్లో కూడా అదే రీతిలో నిలిచింది. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగి మందు పంపిణీని నిలిపివేయడంతో పాటుగా అధ్యయనం చేయనున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో ఆనందయ్య కరోనా మందు పంపిణీ జరిగేందుకు ఆదేశాలు ఇవ్వాలని విన్నవిస్తూ హైకోర్టులో రెండు హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలు అయ్యాయి.
Read More : KCR: షాక్ః కేసీఆర్ చేసిన ప్రకటనే లైట్ తీసుకుంటున్న అధికారులు
ఆనందయ్య మందు… అనేక ఉత్కంఠలకు కేరాఫ్
ఆనందయ్య మందు పంపిణీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో దాఖలైన పిటిషన్, వాదనలో ఆసక్తికర వివరాలు ఉన్నాయి. ఆనందయ్య మందు ఆపటం వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని పిటిషనర్లు పేర్కొన్నారు. లోకాయుక్తా ఆదేశాల మేరకే అపివేశామని స్థానిక పోలీసులు చెబుతున్నారని అయితే, మందు పంపిణీ నిలిపివేయాలని లోకాయుక్త ఆదేశాలు ఇవ్వలేదని పిటిషనర్లు తెలిపారు. లోకాయుక్తకి ఆ అధికారం లేదని వాదించారు.
మరో రెండ్రోజులు ఆగాల్సిందే…
ప్రభుత్వం ఆనందయ్య మందు పంపిణీకి సంబంధించి ఖర్చులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు. శాంతి భద్రతల సమస్య లేకుండా చూడాలని సైతం వారు విన్నవించారు. ఈ రెండు పిటిషన్ల విచారణకు అనుమతించిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ నెల 27న విచారణ చేపట్టనుంది. దీంతో ఆనందయ్య మందు విషయంలో తుది నిర్ణయానికి మరో రెండు రోజులు వేచి చూడక తప్పదని అంటున్నారు.