టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడం తీవ్ర కలకలాన్ని రేపింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం రాత్రి బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తి కాన్వాయ్ పై రాయి విసరడంతో అధి చంద్రబాబు సెక్యూరిటీ చీఫ్ ఆఫీసర్ మధుకు తగలడంతో గాయం అయ్యింది. ఆయనను హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి కుట్లు వేయించారు. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన రోడ్ షోకు పోలీసులు సరైన భద్రత కల్పించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. వైసీపీ రౌడీలకు భయపడేది లేదని అన్నారు.
జగన్ రెడ్డి ఇస్తున్నది నవరత్నాలు కాదు.. నవద్రోహాలు అని చంద్రబాబు అన్నారు. జగన్ ప్రభుత్వం ఇస్తుంది గోరంత, దోచుకుంటుంది కొండంత అని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ దోపిడీని ప్రశ్నిస్తే టీడీపీ నేతలపై అక్రమంగా సీఐడీ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతల ఇళ్లపై పోలీసులు దాడులు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు పోలీసులు గోడలు దూకుతున్నారనీ, ఇటువంటి పోలీసులను గతంలో చూడలేదని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిని ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.
విభజన, విధ్వంసం వైసీపీ సర్కార్ నైజమైపోయిందని చంద్రబాబు విమర్శించారు. దేశంలో ఎక్కడైనా మూడు రాజధానుల ఉన్నాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు భయంతో బతుకుతున్నారని, వారికి జీతాలు సక్రమంగా అందే పరిస్థితి లేదని అన్నారు. రాబోయే టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన చంద్రబాబు.. వైసీపీని బంగాళాఖాతంలో కలిపివేయడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తదితరులు పాల్గొన్నారు.