Suicide: ఆర్థిక ఇబ్బందులో, ప్రేమ విఫలమయ్యో, జీవితంపై విరక్తితోనో చాలా మంది రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు తరచు జరుగుతూనే ఉంటాయి. రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకునేందుకు పడుకున్న వారిని చూసినా లోకో పైలట్ లు అయ్యో పాపం అనడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి. ఒక వేళ ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారిని కాపాడేందుకు వేగంగా వస్తున్న ట్రెయిన్ కు షడన్ బ్రేక్ వేస్తే రైలు పట్టాలు తప్పి ప్రయాణీకులు ప్రమాదంలో పడే పరిస్థితి ఎదురవుతుంది. కానీ ఓ రైలులోని లోకో పైలట్ మాత్రం ట్రాక్ పై ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు పడుకున్న యువకుడిని చూసి షడన్ బ్రేక్ వేశాడు. అంతే కాకుండా గాయపడిన ఆ యువకుడిని అదే రైలులో ఎక్కించుకుని తదుపరి రైల్వే స్టేషన్ కు తీసుకువెళ్లి అక్కడ నుండి అంబులెన్స్ ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ ఘటన విజయవాడలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ముంబాయి నుండి కాకినాడ వెళుతున్ లోకమాన్య తిలక్ రైలు విజయవాడ వస్తుండగా కృష్ణా కెనాల్ రైల్వే స్టేషన్ దాటిన తరువాత ఓ యువకుడు ఆత్మహత్య చేసుకునేందుకు ట్రాక్ పై పడుకున్నాడు. అయితే ఈ రైలు లోకోపైలట్ కేవలం వంద మీటర్ల దూరంలోనే ఆ యువకుడిని చూసి ఒక్కసారిగా ఎమర్జన్సీ బ్రేక్ వేశాడు. రైలు ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రయాణీకులు ఏమి జరిగిందో తెలియక ఆందోళన చెందారు. అయితే అప్పటికే రైలు ఇంజన్ చక్రాలు ఆ యువకుడి కాళ్లపై నుండి వెళ్లడంతో రెండు పాదాలు తెగిపడిపోయాయి. వెంటనే ఇంజన్ నుండి దిగిన లోకో పైలట్ హనుమంతరావు, అసిస్టెంట్ రఘురామ రాజులు బోగి కింద ఉన్న రక్తపు మడుగులో ఆర్తనాదాలు చేస్తున్న ఆ యువకుడి కాళ్లకు గుడ్డలు చుట్టి రక్తం కారకుండా చేశారు. తెగిపడిన పాదాలను పాలిథిన్ కవర్లో వేసి అదే రైలు లోని బోగీలోకి ఎక్కించారు. ఘటన ప్రాంతానికి అంబులెన్స్ వచ్చే అవకాశం లేకపోవడంతో విజయవాడ రైల్వే స్టేషన్ కు సమాచారం అందించారు.
రైల్వే పోలీసులు అప్రమత్తమై విజయవాడ 5వ నెంబర్ ఫ్లాట్ ఫారమ్ పై అంబులెన్స్ ను సిద్ధం గా ఉంచారు. ఈ రైలు విజయవాడ చేరుకోగానే అతన్ని ఆసుపత్రికి తరలించారు. యువకుడు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నులకపేటకు చెందిన పృధ్విగా గురించారు. అతని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఆ యువకుడు ఆత్మహత్యాయత్నం ఎందుకు చేశాడనే విషయం తెలియరాలేదు. ప్రస్తుతం ఆ యువకుడు మాట్లాడలేకపోతున్నాడని, ఆత్మహత్యాయత్నంకు కారణాలు తెలియదని పోలీసులు చెబుతున్నారు. లోకో పైలక్ సమయస్పూర్తిగా వ్యవహరించి మానవత్వంతో తీసుకురావడం వల్ల అతనికి ప్రాణపాయం తప్పింది. ఆ యువకుడి ప్రాణాలను కాపాడిన లోకో పైలట్ ను ప్రయాణీకులు అభినందిస్తున్నారు. యువకుడి తల్లిదండ్రులు అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.