Adimulapu Suresh: ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులకు సుప్రీం కోర్టులో చుక్కెదురు అయ్యింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ దర్యాప్తునకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏపి విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆయన సతీమణి విజయలక్ష్మి ఇద్దరూ ఐఆర్ఎస్ అధికారులు. ఆదిమూలపు సురేష్ 2009 లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆదాయానికి మించిన ఆస్తులు కల్గి ఉన్నారనే అభియోగంతో సీబీఐ అధికారులు 2016 లో దేశ వ్యాప్తంగా పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఆదిమూలపు సురేష్ సతీమణి విజయలక్ష్మి పై 2017లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విజయలక్ష్మిని ప్రధాన నిందితుడిగా, ఆదిమూలపు సురేష్ ను రెండవ నిందితుడుగా సీీబీఐ పేర్కొంది.
Adimulapu Suresh: హైకోర్టు ఉత్తర్వులను తోసి పుచ్చిన సుప్రీం కోర్టు
అయితే తమపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీబీఐ ఎలాంటి ప్రాధమిక విచారణ జరపలేదనీ, దీనిని కొట్టి వేయాలని కోరుతూ సురేష్ దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత కుమారి, విచారణ జరిపింది. ప్రాధమిక విచారణ చేపట్టకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్న పిటిషనర్స్ వాదనలను దృవీకరిస్తూ హైకోర్టు.. సీబీఐ ఆరోపణలను తోసి పుచ్చింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ లో లోపాలు ఉన్నందున మరో సారి ప్రాధమిక విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. అన్ని అధారాలతోనే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు.
సీీబీఐ దర్యాప్తు కొనసాగింపునకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. గత నెల 22న సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. నాడు తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం ధర్మాసనం నేడు తుది తీర్పు వెలువరించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం ధర్మాసనం తోసి పుచ్చింది. ప్రాధమిక విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐకి అనుమతి జారీ చేసింది. తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సుప్రీం కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది.